ఏపీకి మళ్లీ నిరాశే, అందుకే 6 నెలల ముందే రాజీనామా చేశా: హరికృష్ణ
హైదరాబాద్: ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్లీ నిరాశే మిగిలిందని మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో శుక్రవారం స్వల్పకాలిక చర్చకు వచ్చింది.
రాజ్యసభ: ఏపీకి హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన అరుణ్ జైట్లీ
ఈ చర్చలో భాగంగా ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలుపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలను సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు.
ఏపీకి హోదా లేనట్లే: పారిపోవడం లేదన్న వెంకయ్య, కాంగ్రెస్ వాకౌట్
ఈ క్రమంలో అరుణ్ జైట్లీ సమాధానంపై టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో కేంద్రం చెప్పిందే చెబుతోంది తప్ప, హోదా ఇస్తామని చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. అందుకు ఆరు నెలల ముందుగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు.
కాగా శుక్రవారం ఏపీకి ప్రత్యేకోహోదాపై జరిగిన చర్చలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని సూచించారు. దేశంలో చిన్న రాష్ట్రాలు ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని నమ్మే పార్టీ బీజేపీయేనని జైట్లీ వివరించారు. రాష్ట్ర విభజన భావోద్వేగాలతో కూడిన అంశంమని చెప్పారు.
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం కోల్పోయిన మాట నిజమేనని అన్నారు. కొన్నేళ్ల వరకు ఆంధ్రప్రదేశ్కు చేయూత ఇవ్వాల్సిన అవరసం ఉందన్నారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ తదితరాల్లో రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనాలను కలిగిస్తున్నామని జైట్లీ వివరించారు. కేంద్రం నుంచి 42 శాతం నిధులు రాష్ట్రాలకు వెళుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం వద్ద కేవలం 52 శాతం నిధులు మాత్రమే ఉంటాయని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో ఏ రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయమై, తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని, దానికి అనుగుణంగానే సాగుతున్నామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వం ఎంతో అభివృద్ధి చెందిన అధికాదాయ రాష్ట్రమని గుర్తు చేసిన ఆయన, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలతో ఎందులోనూ తీసిపోలేదని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులుపై రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని అన్నారు. మిత్రపక్షం అధికారంలో ఉందని ఎక్కువ నిధులు కేటాయించలేమని తేల్చిచెప్పారు.
నిధులు కేటాయింపు విషయంలో అన్ని రాష్ట్రాలను సంతృప్తి పరచలేమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు కేంద్రం అండగా ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎంలాంటి విద్యాసంస్ధలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశామని అన్నారు.