తారకరత్న ఆరోగ్యం మెరుగవుతోంది, ఆ ప్రచారం నమ్మొద్దు: నందమూరి రామకృష్ణ
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని నందమూరి రామకృష్ణ తెలిపారు.
బెంగళూరు: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తాజాగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ వెల్లడించారు. ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని రామకృష్ణ తెలిపారు. ఎక్మో ఏమి పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందన్నారు.
తారకరత్న ఇంకా వెంటిలేటర్పైనే ఉన్నారని ఆయన చెప్పారు. అయితే, సీటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ తీరుపై క్లారిటీ వస్తుందని రామకృష్ణ తెలిపారు. తారకరత్న స్వయంగా ఆక్సిజన్ కొంత వరకు తీసుకుంటున్నారని చెప్పారు.
త్వరలోనే తారకరత్న నవ్వుతూ బయటికి వస్తారని రామకృష్ణ తెలిపారు.

కాగా, చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణులు ఆస్పత్రికి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కూడా పలుమార్లు ఆస్పత్రికి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.












Click it and Unblock the Notifications