జగన్పై నారా లోకేష్ ఫైర్: 101 జీవోను ఏకేసిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ యువ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. హుధుద్ తుపాను బాధితులకు జగన్ ప్రకటించిన రూ.50 లక్షలు ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. శానససభలో వైయస్ జగన్ తుఫాను బాధితులకు అందించిన సహాయం గురించి చంద్రబాబు ప్రభుత్వపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో నారా లోకేష్ ఆ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 101 జీవోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తప్పుబట్టారు. అసలు ఆ జీవో అన్యాయమైనదిగా జగన్ స్పష్టం చేశారు. గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ జీవోను తెస్తే నేటి చంద్రబాబు సర్కారు దాన్ని అమలు చేస్తోందని విమర్శించారు.
శనివారం అసెంబ్లీ సమావేశాల్లోఎస్సీ, ఎస్టీల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఓసీలతో కమిటీలను ఏర్పాటు చేయడం ఎంతవరకూ సమంజసమని జగన్ ప్రశ్నించారు. గత విధానం ప్రకారం ప్రభుత్వ అధికారులు, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లు, బ్యాంకర్లు కలిసి లబ్ధిదారులను ఎంపిక చేసేవారని చెబుతూ అదే పద్ధతిలో లబ్ధి దారుల ఎంపిక చేపట్టాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
లబ్ధిదారుల కమిటీ సభ్యుల దళారులుగా మారి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీల రుణాల లబ్ధిదారుల ఎంపికలో సామాజిక కార్యకర్తల పేరుతో కొంతమందిని ప్రవేశపెట్టి వ్యవస్థలను పాడు చేయవద్దని జగన్ సూచించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని కోరిన జగన్ ఆధారాలను సమర్పించారు.