నాన్నతో విబేధాలా?: నవ్విన లోకేశ్, 'జగన్లా తండ్రికి తలవంపులు తీసుకురాను'
అమరావతి: నాన్నతో నాకు విబేధాలున్నట్లు దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరులోని కేఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న మూడో రోజు టీడీపీ శిక్షణా తరగతుల్లో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై నారా లోకేశ్ నిప్పులు చెరిగారు.
జగన్ లా తండ్రికి తలవంపులు తెచ్చే పనులు ఎన్నటికీ చేయనని చెప్పారు. జగన్లా చిన్నాన్నతో రాజీనామా చేయించి పదవులు దక్కించుకోవాలనే ఆలోచన నాకు లేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం సరిగా లేనందునే తిరుమల బ్రహ్మోత్సవాలుక హాజరు కాలేకపోయానని చెప్పుకొచ్చారు.
ఇక విశ్రాంతి తీసుకుంటున్నందుకే కార్యకర్తల శిక్షణా తరగతుల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలాంటి వారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకే పదవులు ఉంటాయని, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన నాయకుల పనితీరుపై క్షేత్రస్థాయిలోనూ పరిశీలన ఉంటుందని అన్నారు.

పార్టీ శిక్షణ తరగతులకు గ్రామ శాఖల నాయకులను పిలిస్తే కొంతమంది రాలేదని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన 19 మంది సీనియర్లకు నెలకు రెండు వేల చొప్పున పెన్షన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
తనతో సహా ఏ నేతకైనా సరే పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరుపై పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదికలు వెళుతున్నాయని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ డాష్బోర్డుపైనా లోకేష్ ప్రసంగించారు.
డాష్ బోర్డు రూపకల్పనను వివరించారు. డాష్ పనితీరుపై సలహాలు ఇవ్వాలని కోరారు. టీడీపీ డ్యాష్బోర్డులో అన్ని వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా మీడియాలో వచ్చే సమాచారాన్ని డ్యాష్బోర్డులో పెడతామన్నారు. ఈ సందర్భంగా 'కార్యకర్తలకు త్రికరణ శుద్ధితో నివాళి' అనే పుస్తకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications