నారా లోకేష్ బర్త్ డే: టీటీడీకి భారీ విరాళం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 74,056 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,517 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
ఈ నెల 25వ తేదిన రథసప్తమికి తిరుమల ముస్తాబైంది. ఈ సందర్భంగా రోజు మొత్తం నిర్వహించబోయే వాహన సేవలను వీక్షించడానికి చ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో గ్యాలరీలు సిద్ధం అయ్యాయి. ఈ ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిల తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ నాయుడు ఆదేశించారు. అన్నప్రసాదాలు గ్యాలరీల్లోని ప్రతి భక్తుడికి చేరేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకూ కొనసాగే వాహన సేవలను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారని చెప్పారు.
కాగా- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ టీటీడీకి భారీ విరాళాన్ని అందజేశారు. ఒక్క రోజు మొత్తం అన్న ప్రసాద వితరణకు అయ్యే వ్యయం 44 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా చెల్లించారు. ఈ మొత్తంతో కూడిన డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి అందజేశారు.
చిత్తూరుకు చెందిన చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ మొత్తంతో కూడిన డీడీని దాత తిరుమలలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.












Click it and Unblock the Notifications