బెజవాడకు మకాం మార్చిన లోకేశ్: ముఖ్య కారణం అదే?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి బాట పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తున్న వివాదాలు, ప్రభుత్వ పాలన, నూతన రాజధానికి సమీపంలో ఉండాలనే భావనతో అందరూ విజయవాడ వైపు చూస్తున్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన మకాంను పూర్తిగా విజయవాడకు మార్చేశారు. విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన అక్కడికి సమీపంలోనే కృష్ణా కరకట్టపై అధునాతన హంగులతో రూపొందిన లింగమనేని గెస్ట్హౌస్లో నివసిస్తున్నారు.
తాజాగా ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా విజయవాడకు మకాం మార్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తండ్రి చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్హౌస్కు అత్యంత సమీపంలోనే కృష్ణానది కరకట్టపై లోకేశ్ కూడా గెస్ట్హౌస్ను ఎంపిక చేసుకున్నారు.
శనివారం ఆయన ఆ గెస్టుహౌస్ లోకి వేదమంత్రాల మధ్య ప్రవేశించారని తెలుస్తోంది. చంద్రబాబు గెస్ట్హౌస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఆయనతో దేశవిదేశీ ప్రతినిధులు ఎక్కువగా భేటీ అవుతుండడంతో రాష్ట్ర నేతలు చంద్రబాబును కలవడం కష్టమవుతోందట.

ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు కుదరని టీడీపీ నేతలు ఇకపై నేరుగా నారా లోకేశ్ వద్దకు వెళ్లే అవకాశముంది. అందరికీ అందుబాటులో ఉంటూ టీడీపీ నేతల, కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో నారా లోకేశ్ విజయవాడకు మకాం మార్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత పార్టీ పరంగా విజయవాడకు తరచూ వెళ్లాల్సి వస్తుండటంతో అక్కడ ఆయనకు గెస్ట్ హౌస్ అవసరం ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా పార్టీ వ్యవహారాలు తెలంగాణలోని పార్టీని చూసుకోవాలని గతంలో లోకేశ్ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
అయితే ఆయన తెలంగాణ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఇటీవలే ముగిసిన వరంగల్ ఉపఎన్నికలో అటు చంద్రబాబు నాయుడు, ఇటు తనయుడు లోకేశ్ పార్టీ ప్రచారంలో పాల్గొనకపోవడం విశేషం.












Click it and Unblock the Notifications