బాబు సూచనలు తీసుకుంటారు: అమెరికాలో నారా రోహిత్కు సన్మానం
హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న సిని నటుడు నారా రోహిత్ను ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. బే ఏరియాలో తెలుగు వారు అధికంగా ఉన్నారని, వారందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
అమెరికాలో ఉన్న ఎన్నారైలు భారత్కు, తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్నారై టీడీపీ చాలా కృషి చేసిందన్నారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నారైల సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నారన్నారు.
ఓడిపోయినవారినీ పరిగణనలోకి తీసుకోండి: ఎమ్మెల్యేలు
ఏపీ టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీల ఎంపికలో సమ ప్రాధాన్యం ఉండాలని, రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీమ నేతలు, చంద్రబాబుకు వివరించారు.
ఇంతకు ముందు పోటీచేసి ఓడిపోయిన నాయకులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొందరు కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను నిర్ణయించారు. వీవీ చౌదరి (తూర్పు గోదావరి జిల్లా), తిప్పేస్వామి (అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి (విజయనగరం) పేర్లను ఖరారు చేశారు.