నరసాపురం-చెన్నై వందే భారత్ పై కీలక ప్రకటన..! తాత్కాలిక టైమింగ్స్ ఇవే..!
చెన్నై నుంచి విజయవాడ వరకూ ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం వరకూ పొడిగిస్తూ రైల్వే తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి రాబోతోంది. ఈ నెల 15న నరసాపురంలో స్దానిక ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఈ వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు తాత్కాలికంగా ఈ రైలు రాకపోకలు సాగించే షెడ్యూల్ ను విడుదల చేశారు.
రైలు నంబర్ 20677/20678 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - విజయవాడ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను నరసాపూర్ వరకు పొడిగించారని, దీన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ డిసెంబర్ 15, 2025న మధ్యాహ్నం 01.30 గంటలకు నర్సాపూర్ రైల్వే స్టేషన్ లో ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతం రైలు ప్రయాణ ప్రమాణాలలో గణనీయమైన పరివర్తనను చూడబోతోందని వెల్లడించారు.

ఈ రైలు నరసాపూర్ నుండి భీమవరం , గుడివాడ మీదుగా ప్రారంభమైన మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ కాబోతోందన్నారు. ఈ రైలు నరసాపూర్ , చెన్నై మధ్య 655 కి.మీ దూరాన్ని కేవలం 9 గంటల్లోనే ప్రయాణిస్తుందన్నారు. విజయవాడలో రైలు మారాల్సిన అవసరం లేకుండా చెన్నైకి నేరుగా దీనిలో ప్రయాణించవచ్చన్నారు. ఈ రైలులో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్లు , ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉంటాయన్నారు. 530 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఇది నడుస్తుందన్నారు. ఈ రైలు వారానికి ఆరు రోజులు (మంగళవారం తప్ప) నడుస్తుందని వెల్లడించారు.

జనవరి 11వ తేదీ వరకూ మాత్రమే వర్తించే తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ నరసాపురంలో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి, 3.19కి భీమవరానికి, 4.04కి గుడివాడకు, 4.50కి విజయవాడకు, 5.19కి తెనాలికి, 6.29కి ఒంగోలుకు, 7.39కి నెల్లూరుకు, 9.50కి రేణిగుంటకు, 11.45కు చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అలాగే చెన్నై సెంట్రల్ లో ఉదయం 5.30కి బయలుదేరే వందేభారత్.. 7.05కి రేణిగుంటకు, 8.39కి నెల్లూరుకి, 10.09కి ఒంగోలుకి, 11.21కి తెనాలికి, 11.45కి విజయవాడకు, 12.28కి గుడివాడకు, 1.15కి భీమవరానికి, 2.10కి నరసాపురానికి చేరుకుంటుంది. జనవరి 12 నుంచి మాత్రం ఈ సమయాలు మారతాయి.












Click it and Unblock the Notifications