నరసాపురంలో జగన్ కు పరీక్ష- ఇటు రాజులు వర్సెస్ కాపులు-అటు రాజు వర్సెస్ రాజు
ఏపీలో వైసీపీ పాలన ప్రారంభమై మూడేళ్లు గడిచిపోయింది. నాలుగో ఏట ప్రవేశించిన వైసీపీ మరో ఏడాదిన్నర తర్వాత ఏ క్షణమైనా ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో ఇప్పటికే పార్టీ పటిష్టతపై దృష్టిపెడుతోంది. అదే సమయంలో నరసాపురం నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు అధినేత జగన్ కు సమస్యగా మారిపోతున్నాయి. పార్టీలో రెబెల్ ఎంపీగా ముద్రపడ్డ రఘురామకృష్ణంరాజుతో పాటు తాజాగా సస్పెండ్ అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు, స్ధానిక ఎమ్మెల్యే, జగన్ అనుచరుడిగా పేరుతెచ్చుకున్న ముదునూరి ప్రసాదరాజు మధ్య పోరు వైసీపీకి చేటుతెచ్చేలా కనిపిస్తోంది.

నరసాపురం వైసీపీ పోరు
భీమవరం జిల్లా నరసాపురంలో వైసీపీ పరిస్ధితి మూడు ముక్కలాటగా మారిపోయింది. ఓవైపు రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మరోవైపు స్ధానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు, ఇంకోవైపు కొత్తపల్లిసుబ్బారాయుడు మధ్య సాగుతున్న పోరు క్రమంగా క్లైమాక్స్ కు చేరుకుంటోంది. ఓవైపు ప్రసాదరాజుతో నిత్యం పోరు సాగిస్తున్న కొత్తపల్లి సుబ్బారాయుడిని తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ.. రెబెల్ ఎంపీ రఘురామ విషయంలో మాత్రం అదే నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో సస్పెండ్ అయిన సుబ్బారాయుడు ఇప్పుడు ఇద్దరు రాజులైన ప్రసాదరాజు, రఘురామరాజును టార్గెట్ చేస్తున్నారు.

రాజులు వర్సెస్ కాపులు
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎప్పటి నుంచో కాపులు వర్సెస్ రాజుల పోరు నెలకొంది. ఇది సినిమాలకు సైతం పాకి ప్రభాస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవలకు కూడా దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ పోరు ప్రభావం కనిపించింది. చివరికి రఘురామకృష్ణంరాజు ఇక్కడ ఎంపీగా ఎన్నిక కాగా.. ఎమ్మెల్యేగా ప్రసాదరాజు ఎన్నికయ్యారు. తాజాగా ఎమ్మెల్యే ప్రసాదరాజు వర్సెస్ కొత్తపల్లి సుబ్బారాయుడు రూపంలో ఈ పోరు కొనసాగుతూనే ఉంది. దీని ఫలితంగానే వైసీపీ నుంచి సుబ్బారాయుడు సస్పెండ్ కూడా అయ్యారు.

రాజు వర్సెస్ రాజు పోరు
అదే సమయంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు వైసీపీతో విభేధించి రెండున్నరేళ్లుగా పోరు సాగిస్తుండటంతో ఎమ్మెల్యే ప్రసాదరాజుకూ, ఆయనకూ మధ్య కూడా పోరు సాగుతోంది. అయితే రఘురామ ఢిల్లీకే పరిమితం కావడంతో ఈ పోరు ప్రభావం అంతగా కనిపించడం లేదు. అదే సమయంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కాపు నేత సుబ్బారాయుడు రెబెల్ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజుపై సస్పెన్షన్ విధించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో రఘురామపై వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు కేసులు పెట్టిన వారిలో ప్రసాదరాజు కూడా ఉన్నారు. దీంతో ఇక్కడ రాజు వర్సెస్ రాజు పోరు కూడా కొనసాగుతోంది.

జగన్ కు చిక్కులే?
నరసాపురం వైసీపీలో వివిధ సామాజిక వర్గాల మధ్య నెలకొన్న పోరు నేపథ్యంలో సీఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఈ ఎంపీ నియోజకవర్గం కీలకంగా మారబోతోంది. ఇక్కడ ప్రభావం చూపే రెండు కీలక సామాజిక వర్గాల్లో ఎవరిని దూరం చేసుకోలేక, అలాగని వీరి మధ్య పోరు భరించలేక, వారికి సర్దిచెప్పలేక జగన్ ఇప్పటికే సతమతం అవుతున్నారు. అయితే ఇప్పుడు రఘురామ ఎలాగోవైసీపీకి దూరంగా ఉండటం, ఇప్పుడు సుబ్బారాయుడు కూడా దూరం కావడంతో ఇక మిగిలిన ప్రసాదరాజును నమ్ముకుని జగన్ ఇక్కడ వైసీపీ రాజకీయాన్ని నడిపించాల్సి ఉంటుంది. ఈ పోరు తీరడంపైనే భవిష్యత్తులో నరసాపురంలో వైసీపీ విజయావకాశాలు ఆధారపడి ఉండబోతున్నాయి.












Click it and Unblock the Notifications