పతాకస్ధాయికి నరసాపురం వైసీపీ పోరు-టికెట్ ఇవ్వకపోతే ఇంటిపెండెంట్ గా పోటీ-సుబ్బారాయుడు
నరసాపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు కీలక అంశాల్లో స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో బహిరంగంగానే విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మరో సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనకు టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేస్తానని తేల్చిచెప్పేసారు.

నరసాపురం వైసీపీ పోరు
ఒకప్పుడు టీడీపీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పలు హోదాల్లో పనిచేసి ఓ వెలుగు వెలిగిన కొత్తపల్లి సుబ్బారాయుడు అనంతరం వైసీపీలో చేరారు. అప్పటికే వైసీపీలో చురుగ్గా ఉన్న ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అధినేత జగన్ తో ఉన్న సాన్నిహిత్యంతో రాజకీయాలు నడుపుతూ వరుసగా టికెట్ తెచ్చుకుంటున్నారు.
దీంతో నరసాపురంలో ప్రసాదరాజు, సుబ్బారాయుడు వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. మధ్యలో నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేసే విషయంలోనూ ప్రసాదరాజు, సుబ్బారాయుడికీ మధ్య విభేధాలు వచ్చాయి. నరసాపురం జిల్లా కేంద్రం చేయాలన్న సుబ్బారాయుడు వాదనను ప్రసాదరాజు అంగీకరించలేదు. దీంతో స్ధానిక ఎమ్మెల్యేగా ఉంటూ జిల్లా కేంద్రం అడ్డుకున్నారన్న అప్రతిష్టను ప్రసాదరాజు మూటగట్టుకున్నారు.

ఎమ్మెల్యే కోసం సుబ్బారాయుడు రెడీ
నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేసే విషయంలో స్ధానిక నేతలతో కలిసి పోరాటం చేసిన సుబ్బారాయుడు.. దీనికి మంచి స్పందన రావడంతో నియోజకవర్గంలో తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నరసాపురంలో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా తన సత్తా నిరూపించుకోవాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.
దీంతో ప్రసాదరాజు స్ధానంలో తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరబోతున్నారు. అయితే అదంత సులువు కాదు. ఇప్పటికే జగన్ అనుచరుడిగా పేరు తెచ్చుకున్న ప్రసాదరాజును కాదని వైసీపీ సుబ్బారాయుడికి టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. కానీ తాను పోటీలో ఉండటం ఖాయమని సుబ్బారాయుడు నిన్న తేల్చిచెప్పేశారు.

టీడీపీలోకి సుబ్బారాయుడు?
నరసాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాదరాజును కాదని మీకు సీటిస్తారా అని మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు స్పందించిన సుబ్బారాయుడు.. ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేస్తానన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున బరిలో ఉంటారనే దానిపై మాత్రం సుబ్బారాయుడు స్పష్టత ఇవ్వలేదు. కానీ తాజాగా జిల్లా కేంద్రం వివాదంలో తనకు 41ఏ కింద నోటీసులు ఇవ్వడం, గన్ మెన్ల తొలగింపు నేపథ్యంలో సుబ్బారాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో తిరిగి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications