'నారాయణ రెడ్డిని చంపించింది కేఈ కుటుంబీకులే', కర్నూలుకు జగన్
పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడనే విషయం తెలిసి పార్టీ అధినేత వైయస్ జగన్ హుటాహుటిన కర్నూలు బయలుదేరారు..
కర్నూలు: పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడనే విషయం తెలిసి పార్టీ అధినేత వైయస్ జగన్ హుటాహుటిన కర్నూలు బయలుదేరారు. ఓ పెళ్లికి హాజరై వస్తుండగా కృష్ణగిరి వద్ద ప్రత్యర్థులు కాపు కాచి ఆయన కారుపై దాడి చేసి చంపేశారు.
కేఈ కుటుంబీకులే చంపేశారు: ప్రదీప్ రెడ్డి
నారాయణరెడ్డిని చంపించింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని మృతుడి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు.
పక్కా ప్లాన్తో నారాయణ రెడ్డి హత్య
నారాయణ రెడ్డి తన అనుచరుడితో పెందుర్తిలో వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా దారికాచిన దుండగులు పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. వివాహం అనంతరం కారులో వస్తున్న క్రమంలో కృష్ణగిరి మూలమలుపు దగ్గరకు రాగానే ఎదురుగా ఓ ట్రాక్టర్, వెనుక భాగం నుంచి మరో ట్రాక్టర్ వచ్చింది.
ముందునుంచి వస్తున్న ట్రాక్టర్ వేగంతో వచ్చి నారాయణ రెడ్డి కారును ఢీకొంది. దీంతో స్వల్పగాయాలతో బయటపడిన ఆయన్ను వెనుక నుండి వచ్చిన వాహనం బలంగా ఢీకొంది.
నారాయణరెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ట్రాక్టర్ దిగిన ప్రత్యర్థులు తమతో తెచ్చుకున్న ఆయుధాలతో ఆయనపై దాడి చేసి అతికిరాతకంగా చంపేశారు. ఈ ఘటనలో నారాయణ రెడ్డితోపాటు ఆయన అనుచరుడు సాంబశివుడు చనిపోయారు.