మోడీ మోసం, తెలుగు ప్రజలు బుద్ధి చెప్పాలి: సీఎం నారాయణస్వామి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేసిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. ఉప సంఘం సభ్యుడిగా విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పొందుపరిచామని నారాయణస్వామి స్పష్టం చేశారు.
విజయవాడలో నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీకి హోదా ఇవ్వాలని స్పష్టం చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రం ఇవ్వాలని పేర్కొన్నారు. పోలవరానికి రూ.40వేల కోట్లు అవుతుందని అంచనా వేశామని చెప్పారు.

మోడీ మోసం చేశారు..
రూ.2,500 కోట్లు, అమరావతికి 1,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా? అని నారాయణస్వామి ప్రశ్నించారు. విభజన హామీలు పూర్తి చేసే విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన వైఖరితో ఉందని, ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కు మోసం చేశారని అన్నారు.

తెలుగు ప్రజలు బుద్ధి చెప్పాలి
ఏపీ సొంతంగా వనరులు సాధించుకోలేని పరిస్థితిలో ఉందని, ఏపీని మోసం చేసిన బీజేపీకి కర్ణాటకలోని తెలుగు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. విదేశాల్లో నల్లధనం తెస్తామని చెప్పి.. ప్రజల చేతుల్లో డబ్బులు లాగేసుకున్నారని ఆరోపించారు.

బీజేపీ గెలవదు
పెద్ద నోట్ల రద్దు పూర్తిగా తప్పుడు నిర్ణయమని, దీంతో దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడిందని అన్నారు. వృద్ధిరేటు 6 శాతానికే పరిమితమైందని నారాయణస్వామి అన్నారు. ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిగా మారి విదేశాలకు తిరుగుతున్నారని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలవదని నారాయణస్వామి అన్నారు. ఢిల్లీ, పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని అన్నారు. థర్డ్ జెండర్ గా చూస్తూ పట్టించుకోవడం లేదని అన్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న నారాయణస్వామి
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి సోమవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆర్ధిక మంత్రుల సమావేశంలో పాల్గోనేందుకు ఆదివారం విజయవాడ వచ్చిన ఆయన.. సోమవారం అమ్మవారి మూలవిరాట్టును దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలను అనుసరించి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు.. అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు.












Click it and Unblock the Notifications