‘రాజకీయాల్లోకి రావాలి: జూ. ఎన్టీఆర్ ఎప్పుడూ టీడీపీ కుటుంబసభ్యుడే’
అనంతపురం: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యుడే అని ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర నాయకుడు నరేంద్ర చౌదరి చెప్పారు. ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
జూనియర్ 33వ పుట్టిన రోజు సందర్భంగా అనంతపురం లెప్రసీ కాలనీలో 33 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం కాలనీలోని వారికి దుస్తులు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కాగా, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్.. 2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు, జూ. ఎన్టీఆర్కు మధ్య కొంత దూరం పెరగడంతో ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది.
సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న జూ. ఎన్టీఆర్.. పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ మా తాత స్థాపించిన పార్టీ అని, తాను తమ పార్టీ కోసం అవసరమైన సమయంలో వస్తానని ఎన్టీఆర్ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.