కడియం నర్సరీలలో మొక్కలతో అద్భుతంగా జాతీయజెండా; దేశభక్తి ప్రతిబింబించేలా పర్యావరణ భారతం!!
75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రతీకగా నేడు యావత్ భారతదేశ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్నారు. చిన్న- పెద్ద, పేద- ధనిక అన్న తారతమ్యం లేకుండా, కులమతాలకు అతీతంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎవరికి వారు తమ దేశభక్తిని తెలియజేసేలా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. దేశం పట్ల తమకు ఉన్న అమితమైన గౌరవాన్ని చూపిస్తున్నారు.
కడియం నర్సరీలలో మొక్కలతో అద్భుతంగా స్వాతంత్ర్య భారతం
వ్యక్తిగతంగానే కాకుండా వ్యవస్థాపరంగానూ దేశభక్తి గుభాళిస్తుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం నర్సరీ లలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ రకాల ఖరీదైన ఆకర్షణ మొక్కలతో సందేశాత్మక ఆకృతులను ఏర్పాటు చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుతున్నారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణలో భాగంగా 75 వసంతాల జాతీయ జెండాతో కూడిన ఆకృతిని మొక్కలతో అద్భుతంగా రూపొందించారు.
జాతీయ జెండాను మొక్కలతో రూపొందించిన నర్సరీలు
కడియం నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షులు, కడియపులంక శ్రీ సత్య దేవా నర్సరీ యాజమాన్యం ఈ ఏడాది కూడా స్వతంత్ర దినోత్సవ వన కుర్పులో అగ్రగామిగా నిలిచింది. వివిధ రకాల బోర్డర్ మొక్కలతో స్వతంత్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ మొక్కలను ఏర్పాటు చేసి జాతీయ పతాకం ఆకృతి రూపొందించారు. హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 వసంతాల జాతీయ జెండాతో కూడిన ఆకృతితో మొక్కల కూర్పును అద్భుతంగా తీర్చిదిద్దారు.
60వేల మొక్కలతో పర్యావరణ భారతం .. త్రివర్ణ పతాక శోభ
అలాగే పర్యావరణ భారతంపై అవగాహన కల్పించేందుకే మొక్కలతో ఇటువంటి విభిన్న ఆకృతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని నర్సరీ రైతులు పుల్లా చంటియ్య, పుల్లా అబ్బులు, పెద సత్యనారాయణలు తెలిపారు. అలానే కడియం పల్ల వెంకన్న నర్సరీ లో కూడా దేశభక్తి చాటేలా అద్భుతంగా త్రివర్ణ పతాక శోభ చోటు చేసుకుంది. నర్సరీలో 60 వేల మొక్కలతో త్రివర్ణ పతాక శోభను అలంకరించారు. అందమైన మొక్కలతో అద్భుతమైన సందేశం ఇవ్వడంలో దిట్టయిన ప్రముఖ నర్సరీ రైతు, ల్యాండ్ స్కేప్ డిజైనర్ పల్ల వెంకటేష్ సందర్భాన్ని బట్టి అద్భుతమైన కాన్వాస్ లను రూపొందిస్తూ ఉంటారు.
Recommended Video
76వ స్వాతంత్ర్య స్వేచ్చా భారతిని రూపొందించిన నర్సరీ యాజమాన్యం
ఈ క్రమంలో తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు రోజుల ముందు నుండే బోర్డర్ ,అలంకార రకాల మొక్కలతో పూలను మేళవించి ఆకృతులను రూపొందించారు. ఈ ఏడాది కేవలం రెండు గంటల వ్యవధిలోనే 76 వ స్వాతంత్ర్య స్వేచ్చా భారతిని నర్సరీలో గుభాళింపజేశారు. ఇక నర్సరీలలో విభిన్న స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచే ఆకృతులను రూపొందించి వాటి వద్ద నర్సరీల అసోసియేషన్ బాధ్యులు భారత మాతకు జేజేలు పలికి దేశభక్తిని చాటారు.