మంత్రి మేకపాటికి నిరసన సెగ; ఇప్పుడు తీరిగ్గా వచ్చారా అంటూ నెల్లూరు వరద బాధితుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు వరదలతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. వరద ముంపు ప్రాంతాలలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. చేపడుతున్న అవి అరకొరగా మారుతున్నాయి. వరద తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇదిలా ఉంటే వరదలతో ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ సహాయం అందించటంలో వైఫల్యం చెందుతుందని బాధితులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమను ఆదుకునే నాథుడు లేడు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్ రెడ్డికి నిరసన సెగ
ఇక తాజాగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించడానికి వెళ్లగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి వరద బాధితుల నుండి నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల కి వెళ్ళిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ని వరద బాధితులు గట్టిగా నిలదీశారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. మేము చస్తామో, బ్రతుకుతామో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నామని, ఇప్పుడు తమను పరామర్శించడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నడుములోతు నీళ్ళలో ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన
నిలువ నీడ లేక తినడానికి తిండి లేక అల్లాడిపోయామని ప్రజలు మంత్రి గౌతమ్ రెడ్డి ముందు వాపోయారు. నడుము లోతు వరదనీటితో తాము ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర అసహనంలో ఉన్న వరద బాధితులను పరామర్శించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరఫున వీలైనంత సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పిన ఆయన ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని మరింత అండగా నిలుస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

మంత్రి బాలినేనికి చేదు అనుభవం
ఇదిలా ఉంటే మంగళవారం నాడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నెల్లూరు జిల్లాలో ఇదే చేదు అనుభవం ఎదురైంది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ని, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ ను నెల్లూరు జిల్లా వరద బాధితులు అడ్డుకున్నారు. వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.వరదల దెబ్బకి ప్రజలంతా కష్టపడుతుంటే, మేమంతా నష్ట పోయిన తర్వాత సినిమా చూడటానికి వచ్చారా అంటూ మంత్రి పైన ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తంచేసిన వరద బాధితులు వారితో వాగ్వాదానికి దిగారు. కష్ట సమయాల్లో సహాయం చేయడం మానేసి పరామర్శించడానికి వచ్చారా అంటూ వరద బాధితులు మండిపడ్డారు.

వైసీపీ మంత్రులపై మండిపడుతున్న వరద బాధితులు
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాధితులను ఓదార్చే ప్రయత్నం చేసిన ప్పటికీ వారు వినకపోవడంతో మంత్రి అక్కడి నుండి జారుకున్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులు వ్యవహరించడం సిగ్గుచేటని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి తిండి కూడా లభించడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లాజెల్లాతో పడరాని పాట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .












Click it and Unblock the Notifications