నేదురుమల్లి ఇలా...ఆనం అలా:ఆసక్తికరంగా నెల్లూరు వైసిపి రాజకీయం
నెల్లూరు:బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఆయనను బిజెపిలోనే కొనసాగేలా చేయాలని ఆ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నం సఫలమయ్యే అవకాశం కనిపించడం లేదు.
నేదురుమల్లి వైసిపిలో చేరేందుకు సన్నద్దమవుతున్నారన్న విషయం తెలిసి ఆయనను నిలురించే ప్రయత్నంలో భాగంగా బిజెపి నేదురుమల్లికి పార్టీ పదవిని కట్టబెట్టింది. అయినా నేదురుమల్లి అదేం పట్టించుకోకుండా పదవి ఇచ్చి 24 గంటలు గడవకముందే వైసిపి అధినేత జగన్ను కలుసుకున్నారు. దీంతో ఇక ఆయన బిజెపిని వీడటం ఖాయమని తేలిపోయింది. ఈ క్రమంలో నేదురుమల్లి చేరిక నెల్లూరు వైసిపి రాజకీయంపై గట్టి ప్రభావాన్నే చూపనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నేదురుమల్లి...ఇలా చేశారేంటి?
బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆగస్టు నెలలో వైసీపీలో చేరుతారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమప్తమైన బిజెపి ఇటీవలే పార్టీ మారేందుకు సిద్దమైన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పదవి కట్టబెట్టి నిలువరించిన తీరులోనే...నేదురుమల్లిని కూడా అదే పద్దతిలో ఆపేందుకు ప్రయత్నించారు. ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆ విషయం ప్రకటించిన 9 గంటల వ్యవధిలోనే నేదురుమల్లి రామ్కుమార్ శనివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో వైసిపి అధినేత జగన్ను కలుసుకోవడంతో ఇక ఆయన పార్టీని వీడటం ఖాయమని తేలిపోయింది.

జగన్ ను కలిసి...స్పష్టత
నేదురుమల్లి రామ్కుమార్ను పార్టీలో నిలుపుకొనే క్రమంలో బీజేపీ ఈయనకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చింది. అయినా వైసిపిలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న రామ్కుమార్ ఆ నియామకాన్ని పట్టించుకోకుండా నేరుగా జగన్ శిబిరం వద్ద తేలారు. శనివారం రాత్రికి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శిబిరంలో రామ్కుమార్రెడ్డి జగన్తో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. తాను బేషరతుగా వైసీపీలో చేరడానికి అంగీకరిస్తున్నట్లు జగన్ తో రామ్ కుమార్ చెప్పారట. ఇక త్వరలో తేదీ ప్రకటించి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతానని జగన్కు నేదురుమల్లి స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

దీంతో...ఆసక్తికరంగా నెల్లూరు వైసిపి
నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి చేరిక క్రమంలో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశావాహుల సంఖ్య మరింత పెరిగింది. రామ్ కుమార్ రెడ్డి వైసిపి జగన్ను కలిసి మాట్లాడిన నేపథ్యంలో ఇతనే వెంకటగిరి వైసీపీ అభ్యర్థి అవుతారనే ప్రచారం ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. నేదురుమల్లి అనుచరులు సైతం అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటికే పలువురు ఆశావాహులు క్యూలో ఉన్నారు. వారిలో టిడిపి నుంచి వైసిపిలో చేరికకు నేదురుమల్లి రామ్ కుమార్ కు ముందే రంగం సిద్దం చేసుకున్న ఆనం రామనారాయణరెడ్డి కూడా ఒకరు.

ఆనంకా...లేక నేదురుమల్లికా?
తొలుత ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి కేటాయిస్తారని బలంగా ప్రచారం జరిగింది. మరోవైపు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి కూడా ఈ ఎమ్మెల్యే టికెట్ పైనే నాలుగేళ్లుగా ఆశలు పెట్టుకొని అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. అలాగే రామ్ప్రసాద్రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ వెంకటగిరి వైసీపీలో ఆశావాహుల జాబితా పెరుగుతుండడం నెల్లూరు వైసిపిలో ఉత్కంఠభరితంగా మారుతోంది. మరోవైపు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి చేరిక, వెంకటగిరి టికెట్ ఆయనకే అనే ప్రచారం ఆనం రామనారాయణ రెడ్డి వర్గీయులకు రుచించడం లేదని తెలుస్తోంది. తాను పార్టీలో చేరాలనుకునే సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం తో ఆనం కొంత ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇందరు ఆశావాహుల నడుమ ఈ టికెట్ ఎవరికి ఇస్తే మిగతావారి స్పందన ఎలా ఉంటుందనేది
చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications