టీటీడీ యాప్ కొత్త రికార్డు : శ్రీవారి దర్శనం - సేవలన్నీ ఒకే చోట..!!
తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన యాప్ కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఒక్క రోజులోనే పది లక్షమంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన యాప్ కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఈ నెల 27న TTDevasthanam యాప్ ను టీటీడీ ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా తిరుమల కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చింది. తిరుమలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్ చేసుకోవచ్చు.. అలాగే తిరుమలకు సంబంధించి సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయొచ్చు. ఇప్పటి వరకు ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న సమాచారం ఇక నుంచి భక్తుల చేతుల్లోనే సిద్దంగా ఉండనుంది. దీనికి సంబంధించి జియో సహకారంతో ఈ యప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
గతంలో నిర్వహించిన గోవింద యాప్ పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటంతో ఆ స్థానంలో కొత్త యాప్ తెచ్చారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ సమాచారం అందించే విధంగా ఈ యాప్ ను తీసుకొచ్చారు. 27వ తేదీన ప్రారంభించిన ఈ యాప్ ను ఒక్క రోజులోనే దాదాపుగా 10 లక్షల మందికి పైగా భక్తులు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ లో దర్శనం వివరాలు..స్వామి వారి కైంకర్యాల వివరాలు పొందుపర్చారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి వారికి నిర్దేశించిన సమయం ప్రకారం కొండ పైన వసతి గదులు.. శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అయితే, సేవలకు సంబంధించి టికెట్లు మినహా ఇతరత్రా అవకాశాలు లేవు. కానీ, ఇప్పుడు యాప్ ద్వారా మరింత ఆధునీకరణతో శ్రీవారి సేవలను వినేందుకు వీలుగా రూపకల్పన చేసారు.
శ్రీవారి సేవలు జరిగే సమయంలోనే సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాప్ లో ఎస్వీబీసీ కార్యక్రమాలను వీక్షించే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో స్వామి వారి దర్శనం..వసతి బుక్ చేసుకోవటానికి వెబ్ సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. సహజంగా తిరుమల టికెట్ల బుకింగ్ కు ఉండే రద్దీ ఉంటుంది. ఆన్ లైన్ లో సాంకేతిక సమస్యలతో టికెట్లు దక్కించుకోవటం ఇబ్బందిగా మారుతోంది. దీంతో.. యాప్ ద్వారా సులభతరంగా దర్శనంతో పాటుగా వసతి టికెట్లను పొందే అవకాశం ఏర్పింది.