రఘురామ కేసులో సీబీఐ దర్యాప్తుపై ట్విస్ట్-జగన్, సీఐడీకి ఊరట-కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ రాజద్రోహం కేసులు నమోదు చేసిన తర్వాత అరెస్టు చేసింది. అయితే సీఐడీ కస్టడీలో ఆయన్ను కొట్టడంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రఘురామరాజు తనయుడు భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది.
సీఐడీ కస్టడీలో రఘురామరాజు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని గతంలోనే అభిప్రాయపడిన సుప్రీంకోర్టు దీనిపై సీబీఐ దర్యాప్తుకు వచ్చేసరికి మాత్రం తన స్టాండ్ మార్చుకుంది. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ ఆయన తనయుడు పెట్టుకున్న పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఆయన కోరుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, ఏపీ సీఐడీని ప్రతివాదులుగా కొనసాగించేందుకు మాత్రం నిరాకరించింది. ఈ ముగ్గురిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించింది.
సీఐడీ పోలీసులు కస్టడీలో రఘురామరాజును కొట్టడంపై సీబీఐ దర్యాప్తు చేయించాలన్న పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికీ, సీబీఐకీ ఇవాళ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రబుత్వాన్ని తొలగించడంపై న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీన్ని ధర్మాసనం పట్టించుకోలేదు. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో విచారణ కూడా ఆరువారాల పాటు వాయిదా వేసింది.