కరోనా పడగ నీడలో ఏపీ: ఆ ఆరు జిల్లాల్లో పరిస్థితులు ఘోరం: దిమ్మతిరిగేలా: పలు చోట్ల లాక్డౌన్
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పడగనీడలో కొనసాగుతోంది రాష్ట్రం. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రాన్ని వెల్లువలా ముంచెత్తుతూనే ఉంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్నట్లుగానే 24 గంటల్లో భారీగా కేసులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో 477 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య తొమ్మిది వేల మార్క్నకు చేరువగా వెళ్లింది.

వందల్లోనే..
రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ కరోనా వైరస్ బారిన పడ్డాయి. అన్ని జిల్లాల్లోనూ దిమ్మ తిరిగేలా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి-ఆరు జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రత మరింత భయానకంగా ఉంటోంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 477 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8929కి చేరుకుంది. ఇందులో ఇప్పటిదాకా 4307 మంది డిశ్చార్జి అయ్యారు. 106 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 4516కు చేరింది.

ఆ ఆరు జిల్లాల్లోనే పరిస్థితులు దారుణంగా..
ప్రత్యేకించి 24 గంటల వ్యవధిలో ఆరు జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు-47, తూర్పు గోదావరి-70, కడప-58, కృష్ణా-66, కర్నూలు-47, పశ్చిమ గోదావరి-52 కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే అనంతపురం11, గుంటూరు-26, నెల్లూరు-12, ప్రకాశం-5, విశాఖపట్నం-39, విజయనగరం-6 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళంలో 24 గంటల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన తాజా బులెటిన్ స్పష్టం చేసింది.

రెండు జిల్లాల్లో వెయ్యికి పైగా..
కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటిదాకా మొత్తం వెయ్యికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు-1294, కృష్ణా-1048 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం-800, చిత్తూరు-562, తూర్పు గోదావరి-555, గుంటూరు-768, కడప-388, నెల్లూరు-471, ప్రకాశం-180, శ్రీకాకుళం-59, విశాఖపట్నం-300, విజయనగరం-84, పశ్చిమ గోదావరి-550 పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదు కాగా.. ఆయా జిల్లాలన్నింట్లోనూ భారీ సంఖ్యలో డిశ్చార్జిలు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. కృష్ణాలో-36, కర్నూలు-34, గుంటూరు-11 మంది మరణించారు.
Recommended Video

24 వేలకు పైగా పరీక్షలు..
ఇదిలావుండగా.. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 24 వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. ఇదో రికార్డు. ఇప్పటిదాకా ఇంత పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించలేదు. గరిష్ఠ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఫలితంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ పరీక్షల్లో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆరు లక్షలమందికి పైగా శాంపిళ్లను సేకరించి, పరీక్షించినట్లు వెల్లడించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతపురం, ప్రకాశం సహా పలు చోట్ల లాక్డౌన్ను అమలు చేస్తోంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications