ఏపీలో అంతకంతకూ: విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల మరోసారి: రెండువేలకు చేరువగా డిశ్చార్జ్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా అంతకంతకూ పాజిటివ్ కేసులు కొత్తగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడని జిల్లా అంటూ ఏదీ లేదు. 13 జిల్లాల్లోనూ ఈ వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటోన్న నియంత్రణా చర్యలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, ఫలితంగా పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదితో పోల్చుకుంటే కేసుల సంఖ్య అతి తక్కువగా ఉంటోందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
అందరి చూపూ టీటీడీపైనే: గత పాలక మండలి తప్పులను తిరగదోడుతుందా?: కాగ్ ఎంట్రీ?
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 54 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2841కు చేరింది. ఇప్పటిదాకా 1958 మంది కరోనా వైరస్ పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 59 మంది మరణించారు. ఇక యాక్టివ్గా ఉన్న కేసులు 824. 24 గంటల వ్యవధిలో కర్నూలు జిల్లాలో ఓ పేషెంట్ వైరస్ వల్ల మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మరణాల రేటు తక్కువే అయినప్పటికీ..కొద్దిరోజులుగా ఈ గ్రాఫ్లో పెరుగుదల కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
కొత్తగా నమోదైన 54 పాజిటివ్ కేసుల్లో నాలుగు కోయంబేడు మార్కెట్తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్కు వెళ్లడం వల్ల కరోనా బారిన పడిన పేషెంట్ల కాంటాక్టులకు వైద్య పరీక్షలను నిర్వహించగా నలుగురిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. వారిని వేర్వేరు ఐసొలేషన్ కేంద్రాలకు తరలించారు. నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకరు చొప్పున కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారితో కాంటాక్టు ఉన్నట్లు తేలింది.
గల్ఫ్ సహా విదేశాల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో 111 మందికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడించారు. ఇందులో కువైట్ నుంచి వచ్చిన వారి సంఖ్య అధికంగా నమోదైంది. 50కి పైగా పేషెంట్లు కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్నారని, ఈ సందర్భంగా వారు వైరస్ బారిన పడినట్లు తెలిపారు. అలాగే దుబాయ్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాల ట్రావెల్ హిస్టరీ ఉన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారిలో 293 మందికి వైరస్ సోకిందని, వారిలో 23 మంది డిశ్చార్జి అయినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. 126 యాక్టివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.