ఓ ఫోర్డ్ కార్..రెండు బైక్స్ వెంటాడుతున్నాయ్: 24 గంటలూ ఇంటిపై నిఘా: కాపాడండి: నిమ్మగడ్డ లేఖ
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం తనను నీడలా వెంటాడుతోందని ఆరోపించారు. హైదరాబాద్లోని తన నివాసంపై 24 గంటల పాటూ నిఘా ఉంచిందని చెప్పారు. ఒక ఫోర్డ్ కార్, రెండు బైక్స్ తనను వెంటాడుతున్నాయని అన్నారు. ఆ వాహనాలు ఏపీ పోలీసులకు చెందినవిగా తాను అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. తనను కాపాడాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
కనగరాజ్ విజయసాయిని కలిస్తే లేనిది.. నిమ్మగడ్డ సుజనాను కలిస్తే తప్పా : కేశినేని నానీ ప్రశ్నలివే !!
నిఘా ఉంచడం వల్లే
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్లతో భేటీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతమైన రెండు రోజుల వ్యవధిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్కు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం తనపై 24 గంటల పాటు నిఘా ఉంచిందని, తన ప్రతి కదలికను పసికడుతోందంటూ ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేయడానికి ప్రధాన కారణం.. సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి రావడమేనని సమాచారం.
ఫోన్ ట్యాప్
ప్రభుత్వం తనపై నిఘా ఉంచిన ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్కు విజ్ఙప్తి చేశారు. ఇలాంటి కీలక సమయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. తన ఫోన్ నిరంతరం ట్యాప్ అవుతోందని అన్నారు. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని భద్రపరిచిన కంప్యూటర్లు, ఇతర హార్డ్డిస్క్లను ప్రభుత్వం సీజ్ చేసిందని, వాటిని విడుదల చేయించాలని విజ్ఙప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
విజయవాడకు వెళ్లకుండా..
ప్రస్తుతం తాను హైదరాబాద్ ప్రసన్న నగర్లో నివాసం ఉంటున్నానని, తన తల్లి విజయవాడలో ఉన్నారని, ఆమెను చూడటానికి కూడా వీలు లేకుండా ఏపీ ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలను తీసుకుందని రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనను పునర్నియమిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఉద్దేశపూరకంగా అడ్డుకుంటోందని, ఈ విషయంపై తాను హైకోర్టులో ధిక్కరణ కేసును దాఖలు చేసినట్లు చెప్పారు.
Recommended Video
కనగరాజ్కు అన్ని సదుపాయాలు..
రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి వాణి మోహన్ తాను కార్యాలయంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనకు ఎలాంటి సదుపాయాలను కల్పించట్లేదని చెప్పారు. మే 29న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తాను బాధ్యతలను చేపట్టకుండా చేస్తోందని అన్నారు. ఇప్పటికీ కనగరాజ్ను మాత్రమే ఎన్నికల కమిషనర్గా గుర్తిస్తోందని నిమ్మగడ్డ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం గవర్నర్కు ఉందని, ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరారు. తనకు వ్యక్తిగత భద్రత కల్పించాలని అన్నారు.