ఏపీపై త్వరగా తేల్చండి, ఇవి కావాలి: వెంకయ్య, హోదా కోసం గుడివాడలో ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు.
గంటకు పైగా మాట్లాడారు. ఏపీకి ఇవ్వాలనుకుంటున్న ప్యాకేజీపై తేల్చాలన్నారు. నిధులు, హోదా, ప్యాకేజీపై స్పష్టమైన విధానం రూపొందించి, వీలైనంత త్వరగా తెలపాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయసీమలోని ఏడు జిల్లాలను ఆదుకునేలా ప్యాకేజీ ఉండాలన్నారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు తదితరాలు స్పష్టం చేయాలని సూచించారు. నాటి రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఆయనకు వివరించారు. విభజనానంతర సమస్యలను సిఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పగా, వాటిపై పరిశీలన బాధ్యతను నీతి అయోగ్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో వెంకయ్య పనగారియాతో భేటీ అయ్యారు.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి దారితీసిన పరిస్థితులు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ఆమోదం పొందే సమయంలో పార్లమెంటులో జరిగిన చర్చల సారాంశం గురించి వెంకయ్య వివరించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ, పోలవరం పథకానికి జాతీయ హోదా తదితర అంశాలనూ తెలియజేశారు.
ఏపీకి ఇప్పుడు సొంత రాజధాని లేదని, తీవ్రమైన రెవెన్యూ లోటు ఉందని, ఆదాయ వనరులూ బలహీనమేనని, తగినంత పారిశ్రామికీకరణ లేదని, విద్య, వైద్య సదుపాయాల పరంగానూ తీవ్రకొరత ఉందని వివరించారని వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కొన్ని సూచనలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా మంజూరుతో పాటు ప్రత్యేక అదనపు సాయం అందజేత. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వెనుకబడిన ఏడు జిల్లాలకు అదనపు సాయం. పోలవరం ప్రాజెక్టుకు తగినంత సహకారం. ఒడిశాలోని కలహండి - బొలంగీర్ - కోరాపుట్, ఉత్తర్ప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతాలకి ఇచ్చిన రీతిలోనే పారిశ్రామికీకరణకు ప్రోత్సాహకాలు.
హిమాచల్ప్రదేశ్కు ఇచ్చిన మాదిరిగా పన్ను రాయితీలు మంజూరు. బయటి నుంచి సాయం అందించే పథకాల కింద మరింతగా నిధులు. పునర్విభజన బిల్లులో ప్రస్తావించిన వివిధ ప్రాజెక్టులకు తగినంతగా నిధుల మంజూరు... ఇవి చేయాలని కోరారు. వెంకయ్య సూచనలకు పనగారియా సానుకూలంగా స్పందించారని సమాచారం.
ప్రత్యేకహోదా కోసం గుడివాడలో వ్యక్తి ఆత్మహత్య
ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మనస్తాపం చెంది కృష్ణాజిల్లా గుడివాడ శ్రీరామపురం కాలనీకి చెందిన ఉదయభాను(40) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ డీఎస్పీ వైబిపిటి అంకినీడు ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా మొబైల్ టవరెక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ఉదయభాను ప్రయత్నించగా అతని మిత్రులు వారించారు.
గురువారం అర్థరాత్రి సమయంలో తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఉదయభాను తల్లి సిరిపురపు తులసీరాణి గుడివాడ నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.