పోస్టింగ్ కోసం ఏబీ ఎదురుచూపులు-సస్పెన్షన్ ఎత్తేసినా-అపాయింట్మెంట్ ఇవ్వని సీఎస్
ఏపీలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తేసిన వైసీపీ సర్కార్ పోస్టింగ్, జీత భత్యాల బకాయిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆయనపై సప్పెన్షన్ ఎత్తేస్తూ నిన్న జీవో జారీ చేసిన ప్రభుత్వం ఈ రెండేళ్లుగా తనకు ఇవ్వాల్సిన జీత భత్యాల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇవాళ జీఏడీలో రిపోర్ట్ చేసిన తర్వాత విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
తనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని హైకోర్టు చెప్పిందని సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై చట్టప్రకారం మాత్రమే ముందుకెళ్లానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జీఏడీలో రిపోర్ట్ చేశైానని, అయితే జీత భత్యాల బకాయిలపై క్లారిటీ కోసం సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సరిచేసి ఇవ్వాలని కోరేందుకు తాను సీఎస్ తో భేటీ కోసం ప్రయత్నించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇంకా కలవలేదని, ప్రభుత్వ ఉత్తర్వు సరిచేయాలని కోరేందుకే సీఎస్ను కలవాలని అనుకున్నానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తనను కలవడం సీఎస్ కు ఇష్టం లేదేమోనని ఆయన వ్యాఖ్యానించారు. నేనేం తప్పు చేశానో అధికారులు తేల్చాలని, నేనేమైనా తప్పులు చేస్తే బయటకు చెప్పాలి కదా. నా జీతం గురించి మాట్లాడేందుకు సీఎస్కు ఇబ్బంది ఏంటి? పోస్టింగ్ ఇవ్వలేదు.. జీతం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి?'' అని ఏబీవీ ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.