బాబుతో సవాలా?: కేసీఆర్పై రావెల, నటుడు సురేష్ ఫైర్
హైదరాబాద్/విజయవాడ: తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సవాల్ చేసే స్థాయి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు ఆదివారం అన్నారు. రాజకీయ లబ్ధికోసమే కేసీఆర్ సవాళ్లు చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో పాల్గొనమని అనడం చాలా అవివేకమన్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబును చూసి నేర్చుకోవాలిగానీ... బాబుతో పోటీ పడడానికి కేసీఆర్ ఎవరు? ఆయన స్థాయి ఏమిటన్నారు.
కేసీఆర్పై సురేష్ నిప్పులు
కేసీఆర్ పైన సినీనటుడు, బీజేపీ నేత సురేష్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్ చేతిలో పెట్టడమే మంచిదని, దీనిపై కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తెలంగాణలో అభద్రతాభావంతో ఉండే వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుందన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం కేసీఆర్కు తగదన్నారు. మొదట్లో రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని, ఇప్పుడు 1956కు ముందు అంటూ స్థానికత పేరుతో మరో విభజనకు సిద్ధమయ్యారన్నారు.

రెండు రాష్ట్రాలు సమానమేనని వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి ఉభయ రాష్ట్రాలు ఒక్కటేనని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. రాష్ట్రాలు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని హితవు పలికారు.
సమర్థవంతంగా అమలు: పత్తిపాటి
రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు వేరుగా అన్నారు. విపక్షాలు తప్పుడు సమాచారం ఇస్తూ రుణమాఫీ అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. స్థానికత సర్వే ద్వారా ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications