కోటంరెడ్డికి బావ కాకాణి ఘాటు కౌంటర్- పీడ, దరిద్రం పోయింది-కలుపుమొక్కలతో పోయేదేం లేదు..
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆయన బావ, రాష్ట్రమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరుసగా రెండోరోజూ ఎదురుదాడి కొనసాగించారు. కోటంరెడ్డి ఇవాళ చేసిన వ్యాఖ్యలకు కాకాణి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
అనంతపురం : ఏపీలో వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. పార్టీ నుంచి సైలెంట్ గా వెళ్లిపోదామని తాను అనుకుంటే కెలుకుతున్నారంటూ ఇవాళ కోటంరెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి, ఆయన బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లే విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. పెద్ద గొంతు వేసుకుని శ్రీధర్ రెడ్డి మాట్లాడితే ఇక్కడ ఎవరూ భయపడరన్నారు. శ్రీధర్ రెడ్డి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారన్నారు. నువ్వు సున్నా ఒకటి అనే జగన్ గారి పక్కన ఉండబట్టే నీకు విలువ వచ్చిందని తాను ఎప్పుడో చెప్పానన్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసే ఆరోపణలు పసలేనివన్నారు. చేతనైతే, నీ దగ్గర ఉన్న ఆడియో క్లిప్పై విచారణ చేయించాలని కాకాణి సవాల్ విసిరారు. ట్యాపింగ్ అనేదానికి నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి...? అని ప్రశ్నించారు. నువ్వు కోర్టుకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి విచారణ చేయించుకోవచ్చన్నారు. ఆ సాక్ష్యం ఏ ఏజెన్సీ దగ్గర పెట్టాలో అక్కడ పెట్టు.. వాస్తవమేమిటో నిగ్గు తేలుతుందన్నారు.
శ్రీధర్రెడ్డి లాంటి వాడు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్కు పోయేదేమీ లేదని కాకాణి వ్యాఖ్యానించారు. పార్టీకి పట్టిన పీడ, దరిద్రం పోయిందన్నారు. ఇప్పుడు టీడీపీకి ఆ దరిద్రం పట్టిందన్నారు. ఆయన టీడీపీలో చేరడం వల్ల నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం కుప్పకూలిపోయిందనే వార్తలు మనం మున్ముందు వినబోతున్నామన్నారు. ఇక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హౌస్ ఫుల్గా ఉంది కాబట్టి టీడీపీ కాళీగా ఉందని అక్కడకు వెళ్తున్నారన్నారు. జగన్ బీఫాం ఇవ్వకపోతే నీ స్థానం ఎక్కడ అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి నీకు బీ-ఫామ్ ఇ్వకపోతే నువ్వు జన్మలో శాసనసభ్యుడివి అయ్యుండేవాడివా..? ఆర్ధికంగా ఈ స్థాయికి ఎదిగి ఉండే వాడివా..? అని కోటంరెడ్డిని కాకాణి ప్రశ్నించారు. కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి వాళ్లపై దౌర్జన్యం చేస్తావా..? నువ్వు తప్పుచేస్తే కేసులు పెట్టరా..? అని నిలదీశారు. నువ్వేమన్నా మొనగాడివా... చట్టానికి అతీతుడివా.. తప్పు చేస్తే కేసులు పెట్టకుండా ఉండటానికి..? అన్నారు. నమ్మకం లేని చోట ఉండలేను అంటున్నావ్...అసలు నీకు నమ్మకం లేదు కాబట్టే, పదవులు ఇవ్వలేదని వెళ్లిపోయావ్ అన్నారు. నీకు టిక్కెట్ ఇవ్వడమే గొప్ప...ఆ రోజు ఎంత ఒత్తిడి ఉన్నా జగన్మోహన్రెడ్డి నీకు టిక్కెట్ ఇచ్చారన్నారు.
శ్రీధర్రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణల్లో దేవుని వద్ద ప్రమాణానికి రావాలన్నారు.నిందలు వేయడం, బురదజల్లడం శ్రీధర్ రెడ్డికి ఆనవాయితీ అని, అతని గురించి దారిన పోయే చిన్న పిల్లవాడు కూడా చెప్తాడన్నారు. నిందలు వేసి వెళ్తున్నావు కదా...ఆధారాలు చూపించి వెళ్లమన్నారు. శ్రీధర్ రెడ్డికి ఏ మాత్రమైనా, నీతి, నిజాయితీ ఉండి ఉంటే జగన్ గారిని విడిచిపెట్టి వెళ్ళే వాడు కాదన్నారు. టిక్కెట్ రానటువంటి వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు..వారికి రాజకీయ పునరాసం కావాలన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా...జగన్ ఇచ్చిన బీ-ఫామ్ మీద గెలిచి, వెళుతున్న వారికి తాను పదే పదే ఒకటే చెప్తున్నానని, 2024లో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ 100 శాతం స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ఇప్పుడు మాట్లాడే వారి పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఆరోజు మళ్ళీ మాట్లాడుకుందామన్నారు.
ప్రజల్లో టీడీపీ లేదు...రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగిస్తుందని కాకాణి తెలిపారు. మేయర్ వెళ్లినంత మాత్రాన ఏమవుతుందన్నారు. ఆనాడు 23 మంది పార్టీని వీడి వెళ్లినప్పుడే తమ నాయకుడు బెదరలేదని,రెండు, మూడు కలుపు మొక్కలను తీసేసినంత మాత్రాన ఏమీకాదన్నారు. వేరిపారేయాల్సిన వాళ్లు ముందుగానే తెలుసుకుని పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. శ్రీధర్రెడ్డి నోటి వెంటనిజం వస్తే ఒట్టు...నెల్లూరు జిల్లాలో శ్రీధర్ రెడ్డి గురించి ఎవర్ని అడిగినా చెప్తారు అబద్ధాలను అద్భుతంగా చెప్పగలడని అని కాకాణి విమర్శించారు. అందరికీ తగువులు పెట్టడం ఆయనకు అలవాటన్నాకు. ఆయన లోపల మనిషిని నెల్లూరు జిల్లా ప్రజలను అడిగితే చెబుతారన్నారు.శ్రీరీధర్ రెడ్డి ముఖం చూసి తాను వైఎస్సార్సీపీలోకి రాలేదని, జగన్మోహన్రెడ్డి నాయకత్వం చూసి వచ్చానన్నారు. ఏ రోజైతే జగన్ కాంగ్రెస్పార్టీని వీడి వచ్చాడో ఆనాడే ఆయన వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నా అన్నారు.