ఆలోచన లేదు, ఐనా రాజకీయాలొద్దు: కొత్త పార్టీపై కిరణ్
శ్రీకాకుళం/హైదరాబాద్: తనకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడారు. కొత్త పార్టీ విషమయై ప్రశ్నించగా.. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. రాష్ట్రం మొత్తం వరదలతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజకీయాలు మాట్లాడనని చెప్పారు.
కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, అందరి కష్టాలు గట్టెక్కించడానికి తానున్నానని, ఎవరు అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి రైతులకు, బాధితులకు అభయం ఇచ్చారు. కిరణ్ శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు. తానున్నానంటూ భరోసా ఇచ్చేందుకు కషి చేశారు. వాన తాకిడికి నేలకొరిగిన జొన్న కంకుల నుంచి విత్తనాలు మొలకెత్తి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు, మహబూబ్నగర్ జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం విచారణకు ఆదేశించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేలా చూడాలని ఆదేశించారు.
పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఘటనా స్థలానికి వెళ్లాలని ఆ జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ, గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సూచించారు. వనపర్తిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ పూర్తి చేసి ప్రమాదానికి కారణాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు మరణించడంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.