దిశ బిల్లు అభ్యంతరాలపై ఏపీ నుండి స్పందన రాలేదు : గోరంట్ల మాధవ్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019కి ఇంకా పార్లమెంట్ లో మోక్షం లభించలేదు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు అరికట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది దిశ చట్టం. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్, చట్టాన్ని అమలు చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసినప్పటికీ పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. ఏపీ అసెంబ్లీ లో దిశా చట్టాన్ని ఆమోదించి పార్లమెంటుకు పంపిన ఏపీ సర్కార్ పార్లమెంటులో దిశా బిల్లు ఆమోదం పొందక పోవడంతో ఏపీలో అమలుకు నోచుకోలేదు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం
ఈ క్రమంలో దిశ బిల్లు విషయంలో కేంద్ర ఎందుకు తాత్సారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. లోక్సభలో గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా సమాధానమిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపిన దిశా బిల్లు విషయంలో తమ అభ్యంతరాలను హోం మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది . పలు అంశాలపై వివరణ కోరినట్టు పేర్కొంది. అయితే కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ వెల్లడించారు.
దిశా బిల్లు ఏపీలోనే అమలయ్యే విధంగా ఐపీసీ చట్టాలతో చేసిన ఏపీ సర్కార్
దిశా బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి మాత్రమే వర్తించేలా ఐపీసీ లో కొత్తగా 354ఈ, 354 ఎఫ్, 354 జి సెక్షన్లను చేర్చింది. ఇక ఈ సెక్షన్ల విషయంలోనే చట్టంగా మార్చడానికి పార్లమెంటుకు ఇబ్బంది తలెత్తింది. ఏపీ కోసం వారు కోరిన విధంగా చట్ట సవరణ చేస్తే, మిగతా రాష్ట్రాలు భవిష్యత్తులో ఎవరి ఇష్టానికి వారు మార్పులు చేర్పులు కోరవచ్చు. అప్పుడు ఐపీసీ అమలు ప్రశ్నార్ధకం అవుతుంది.
దిశా బిల్లులో అభంతరాలపై స్పందించని ఏపీ .. లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం
ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి తిరిగి పంపాలని కేంద్రం సూచించింది. ఈ దిశ బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్లో ఎంట్రీలు సరిగాలేవని, వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసింది .ఈ నేపథ్యంలో కేంద్రం నాడు దిశా బిల్లును తిప్పి ఏపీకి పంపించింది. అభ్యంతరాలపై స్పందించాలని, సవరణలు చేసి పంపించాలని పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం స్పందన తెలియజేయకపోవటం దిశా బిల్లు ఆమోదం పొందకుండా ఉండటానికి కారణం అని పేర్కొంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏపీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు .