చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసు .. సజ్జల చెప్పారో లేదో కర్నూలులో న్యాయవాది ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై కర్నూలు జిల్లాలో కేసు నమోదయింది. కర్నూలు జిల్లాలో స్థానిక కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య చంద్రబాబు నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై కర్నూల్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
ఎన్440కే వైరస్ ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టారని ఫిర్యాదు
కరోనా వైరస్ కు సంబంధించి చంద్రబాబునాయుడు చేస్తున్న దుష్ప్రచారం వల్లే కర్నూలులో సామాన్య జనం భయాందోళనకు గురవుతున్నారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు అని సుబ్బయ్య ఆరోపించారు.ఎన్440కె కరోనావైరస్ జాతి ఇప్పటికీ ప్రబలంగా ఉందని, ఇతర జాతులతో పోలిస్తే 15 రెట్లు ఎక్కువవ్యాపిస్తుందని, ప్రాణాంతకమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కర్నూలు ప్రజలలో భయాన్ని కలిగించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై కేసు
కర్నూలు కు చెందిన న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై క్రైమ్ నెంబర్ 80 /2021 ప్రకారం ఐపీసీ 155 ,505 (1)బి(2) స్పెషల్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అదే విధంగా ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద కూడా చంద్రబాబు పై సెక్షన్ 4 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఫైల్ చేశారు పోలీసులు.
సజ్జల చెప్పిన వెంటనే చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు
అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకుపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ రకం కొత్త వైరస్ అంటూ దుష్ప్రచారం చేస్తున్న, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు పై కేసులు పెట్టాలని మండిపడ్డారు. ప్రజలు ఎక్కడికక్కడ చంద్రబాబును నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి అలా చెప్పారో లేదో వెనువెంటనే కర్నూలు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై కేసు నమోదైంది.
Recommended Video
తప్పుడు ఫిర్యాదు అని మండిపడుతున్న టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ నేతలను ఏదో ఒక విషయంలో టార్గెట్ చేస్తూనే ఉన్నారని, ఇప్పటికే టిడిపి సీనియర్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక తాజాగా చంద్రబాబు నాయుడిపై సైతం కర్నూలులో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం టిడిపి శ్రేణులకు షాక్ అనే చెప్పాలి. అయితే, తప్పుడు ఫిర్యాదుపై చంద్రబాబుపై కేసు నమోదు చేసినట్లు టిడిపి జిల్లా నాయకులు ఆరోపిస్తున్నారు. టిడిపి అధినేత, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్ 440 కె వైరస్ పట్ల ఏపి ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేశారని వారు తెలిపారు.