ఏపీలో అక్కడ అత్యధిక వర్షపాతం నమోదు
Temperature in AP: ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి నేడు కూడా కొనసాగే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళవారం చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రాత్రి 8 గంటల సమయానికి పార్వతీపురం మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా బాడంగిలో 44.5, ప్రకాశం చంద్రశేఖరపురంలో 44.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది.

నేడు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వీటితో పాటు పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అదే సమయంలో- నంద్యాల, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత 40 డిగ్రీల కంటే అధికంగా కనిపించింది.
నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. అన్నమయ్య రాయచోటి జిల్లా కంబాలకుంటలో 41.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఒక వైపు వర్షాలు, మరో వైపు 40 డిగ్రీలకు పైగా ఎండ కాస్తోందని, ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications