పోలవరం కోసం ఎదురుచూడలేం, పట్టిసీమ ముందుకే: చంద్రబాబు
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కోసం ఎదురు చూడలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం కోసం ఎదురుచూడకుండా కాలువల ద్వారా నీరందిస్తామని చెప్పారు. అందుకే ఎందరు వ్యతిరేకించినా పట్టిసీమ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 235 మండలాలను కరువు మండలాలుగా గుర్తించినట్లు తెలిపారు. కరువు మండలాలను పూర్తి ఆదుకుంటామని చెప్పారు,
ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయని, చాలా ఇబ్బందులను ఎదుర్కుంటోందని అన్నారు. రాష్ట్రం కరువు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కోనేందుకు రూ. 10,500 కోట్ల సహాయాన్ని కేంద్రాన్ని కోరామని చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ర్టానికి సమస్యలేం కొత్త కాదని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది అత్యల్ప వర్షపాతం నమోదైందని, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గ్రామాల్లో నీటి సరఫరా కోసం రూ. 82 కోట్లు కేటాయించామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రాన్ని రూ. 1537కోట్లు సాయం కోరామని సీఎం వెల్లడించారు.

కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచామని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఎదురుచూడటం మంచి కాదని అన్నారు. అందుకే ఎంతమంది వ్యతిరేకించినా పట్టిసీమ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని, రాయలసీమకు నీరందిస్తామన్నారు. గోదావరి జిల్లాలకు అన్యాయం చేయబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కరువు కారణంగా పశువులను పోషించలేని రైతులు పశు వసతి గృహాలకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. వేసవి తర్వాత పశువులను రైతులకు తిరిగి అప్పగిస్తామని చెప్పారు. కరువు ప్రాంతాల్లో పంట నష్టం పరిహారాన్ని పెంచామని, కరువులోనూ వ్యవసాయం రంగంలో అభివృద్ధి సాధించామని బాబు పేర్కొన్నారు.
హంద్రీనీవా ద్వారా అనంతపురానికి నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. కేంద్రాన్ని సాయం కోరిన బిజెపి ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నట్లు తెలిపారు. కరువు తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఎంత డబ్బులైనా ప్రజలను ఆదుకుంటామని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ. 5 లక్షలు పరిహారంగా ఇస్తున్నామని చెప్పారు.
కరువు మండలాల్లో ఉపాధి హామి పని దినాలు పెంచామని చంద్రబాబునాయుడు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కరువు, తుఫానుల వల్ల రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications