'జయరాం హత్య కేసులో శిఖాచౌదరే అసలు సూత్రధారి': రెండో అధికారికి షాక్.. ఏసీపీపై బదలీ వేటు
అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆయన సతీమణి పద్మశ్రీ మంగళవారం పోలీసులకు మరోసారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసులో ఆమె తన వేలును తన భర్త మేనకోడలు శిఖాచౌదరి వైపు చూపిస్తున్నారు. ఈ మేరకు పోలీసుల ఎదుట మరోసారి వాంగ్మూలం ఇచ్చారు.
టాప్ హీరోయిన్ వ్యభిచారం కేసులో.. రాకేష్ మామూలోడుకాదు: మాయలో శిఖా, జయరాంను 'అమ్మాయి'తో కొట్టాడు
శిఖాచౌదరి హస్తం లేకుండా హత్య జరిగే అవకాశం లేదు
తన భర్త జయరాం హత్య కేసులో శికా చౌదరి అసలు సూత్రధారి అని పద్మశ్రీ తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. శిఖాచౌదరి హస్తం లేకుండా హత్య జరిగే అవకాశమే లేదని ఆమె చెబుతున్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాఫ్తు చేయాలని కోరుతున్నారు. ఈ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని పోలీసులు తేల్చితే కనుక తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. 2016లోనే బంధువులతో తనకు ప్రాణహానీ ఉందని తన భర్త చెప్పాడని అంతకుముందు ఆమె చెప్పారు.
రహస్య ప్రాంతానికి శిఖా చౌదరి?
మరోవైపు, శిఖా చౌదరిని రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది. జయరాంను రాకేష్ చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్య కేసులో శిఖాచౌదరి పాత్ర గురించి ఇంకా తేలలేదని చెబుతున్నారు. అయితే గత అర్ధరాత్రి శిఖాను రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఆమెకు ముసుగువేసి హైదరాబాద్ వైపు తీసుకు వెళ్లి ఉంటారని అంటున్నారు. జయరాం హత్య కేసుపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను తరలించడం గమనార్హం.
ఏసీపీ పైన కూడా వేటు
జయరాం హత్య కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ పైన కూడా బదలీ వేటు పడింది. ఇప్పటికే ఓ ఇన్స్పెక్టర్ పైన బదలీ వేటు పడింది. ఇబ్రహీంపట్నం ఎసీపీ మల్లారెడ్డిని అంబర్ పేట హెడ్ క్వార్టర్కు అటాచ్ చేశారు. ఏపీ పోలీసుల నుంచి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ తెలిపారు.
ఏసీపీ ఏం చెప్పారంటే?
జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డి ఫోన్ కాల్ లిస్టులో ఓ ఏసీపీ పేరు కూడా ఉంది. దీనిపై సదరు ఏసీపీ మల్లారెడ్డి స్పందించారు. రాకేష్ రెడ్డి తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. ఇద్దరు గొడవపడి ఓ వ్యక్తి కిందపడినట్లుగా తనకు చెప్పాడని, ఆ విషయం చెప్పేందుకు తనకు ఫోన్ చేశాడని అన్నారు. దీంతో తాను అతనికి పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం ఇవ్వాలని సూచించానని చెప్పారు. జయరాం హత్యకు సంబంధించిన వివరాలు తనకు చెప్పలేదన్నారు. పాతకేసులో నిందితుడిగా ఉన్నందున రాకేష్ అప్పుడప్పుడు తనతో ఫోన్లో మాట్లాడేవాడని చెప్పారు. ఆ పరిచయంతోనే ఫోన్ చేశాడన్నారు.