అసెంబ్లీ, మండలిలోనూ ఎన్టీఆర్ వర్సిటీ బిల్లు ఆమోదం-టీడీపీ నిరసనల మధ్యే...
ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ చేసిన చట్ట సవరణ బిల్లుకు చట్టసభలు ఇవాళ ఆమోదం తెలిపాయి. తొలుత అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అనంతరం మండలిలోనూ ప్రవేశపెట్టి నెగ్గించుకుంది. ఇరుసభల్లోనూ మెజార్టీ ఉండటంతో బిల్లు ఆమోదంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ పేరుతో మారుస్తున్నారన్న సమచారంతో ఉదయం నుంచి ఇరుసభల్లోనూ విపక్ష టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. అయితే వాటిని సభాపతులు తిరస్కరించారు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ఆరోగ్యమంత్రి విడదల రజనీ ఆమోదం కోరారు. దీనిపై చర్చ జరిగింది. చివర్లో సీఎం జగన్ ప్రసంగం తర్వాత బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మధ్యలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగినా స్పీకర్ వారిని సస్పెండ్ చేయడంతో సభ సజావుగా సాగిపోయింది.

అటు మండలిలోనూ ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర గందరగోళం తప్పలేదు. బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తీవ్ర నిరసన తెలిపారు. బిల్లును అడ్డుకునేందుకు సైతం ప్రయత్నించారు. విపక్షాల నిరసనల మధ్యే ఆరోగ్యమంత్రి విడదల రజనీ బిల్లును ప్రవేశపెట్టడం, మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆమోదించడం కూడా జరిగిపోయాయి. విపక్షాల నిరసనలను పట్టించుకోకుండా మండలి కూడా ఈ బిల్లును ఆమోదించడంతో ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు కాస్తా వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారిపోయింది.












Click it and Unblock the Notifications