ఆధ్యాత్మిక క్షేత్రంలో పాశ్చాత్య డిజైన్లా? తిరుపతి రైల్వేస్టేషన్ డిజైన్లపై అభ్యంతరాల వెల్లువ; స్పందించిన ఎంపీ!!
తిరుపతి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దబోతున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైల్వే స్టేషన్ కు సంబంధించిన డిజైన్లు పూర్తి చేయగా, ఆయా నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలోనే తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు మొదలు పెట్టబోతున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించి, రైల్వే స్టేషన్ డిజైన్లను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. భారతదేశంలోని అద్భుతమైన స్టేషన్లలో ఒకటిగా తిరుపతి రైల్వే స్టేషన్ ను మార్చబోతున్నట్లు వెల్లడించారు.

తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత
అయితే తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ డిజైన్లు పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిని ప్రదర్శిస్తున్నాయి అంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి గొప్పతనాన్ని తెలియజేసేలా రైల్వే స్టేషన్ డిజైన్ లు ఉంటే బావుంటుంది అని చెబుతున్నారు. ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ తో ప్రజల్లో రైల్వే స్టేషన్ డిజైన్ల పై నిరసన వ్యక్తమవుతోంది.

ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాధాన్యత ఆ డిజైన్ లలో లేదని మండిపాటు
ఇక సోషల్ మీడియాలోనూ తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తిరుపతి కాదు వాటికన్ సిటీ! తిరుమల తిరుపతి వారసత్వం నుండి కొంత నేర్చుకుని డిజైన్లను మార్చండి అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లు భయంకరంగా కనిపిస్తున్నాయని. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తు లేదు, గొప్ప తెలుగు సనాతన సంస్కృతి జాడ లేదు. ఇదేమి చెత్త డిజైన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ తిరుపతి మరియు తిరుమల పవిత్ర నగరాల వాస్తుశిల్పం మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించటం లేదని మండిపడుతున్నారు.

ఎంపీ గురుమూర్తికి తిరుపతి వాసుల అభ్యంతరాలు
ఇప్పటికే తిరుపతి వాసులు స్థానిక ఎంపీ మధ్య గురుమూర్తి కి తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఇక ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై ఎంపీ గురుమూర్తి స్పందించారు తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని గురుమూర్తి ట్విట్టర్ వేదికగా తెలిపారు. భారతీయ వాస్తు శాస్త్రం ప్రతిబింబించేలా, ఆధ్యాత్మిక నగరానికి ప్రతీకగా నిలిచిన తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

డిజైన్ల మార్పుపై రైల్వే శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందో?
మొత్తం 299 కోట్లతో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ గా తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనుందని, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి స్థానిక ప్రజల చిరకాల కల అని ఆయన పేర్కొన్నారు. అది ఇంత కాలానికి నెరవేరుతుందని, అయితే డిజైన్ మార్పుపై రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతానని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఈ డిజైన్లను మార్చాల్సిందేనని ప్రజలు తేల్చి చెబుతున్న నేపధ్యంలో మరి డిజైన్ల మార్పు విషయంలో రైల్వే శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications