బస్సు బీభత్సం: వ్యక్తి మృతి, ముగ్గురికిగా గాయాలు
హైదరాబాద్/తూర్పుగోదావరి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో ఆర్టీసి బస్సు బీభత్సం సృష్టించింది. మహబూబ్నగర్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. రెండు ఆటోలను ఢీకొట్టింది. దీంతో ఓ ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ఘటనా స్థలంలో ఉన్న పలువురు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువకుల మృతి
తూర్పుగోదావరి: జిల్లాలోని రాజమండ్రి-హుకుంపేట జాతీయ రహదారిపై గురువారం మధ్యహ్నం లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన బొర్రా సూర్యం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శంఖవరం గ్రామానికి చెందిన రాజులు బుధవారం రాత్రి రాజమండ్రిలోని ఓ వివాహానికి హాజరయ్యారు.
వివాహం అనంతరం బొమ్మూరులోని తమ స్నేహితుని ఇంట్లో ఉండి గురువారం మధ్యాహ్నం అతని బైక్ తీసుకుని రాజమండ్రి వస్తుండగా హుకుంపేట వద్ద వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.