హిందూపురంలో కొనసాగుతున్న బంద్.. జిల్లా కేంద్రం ఏర్పాటుకోసం పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిందూపురం జిల్లా కేంద్రంగా చేయడం కోసం జనవరి 29వ తేదీ శనివారం నాడు అఖిలపక్ష నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఈ రోజు హిందూపురంలో బంద్ కొనసాగుతోంది. హిందూపురం బస్ స్టాండ్ లో అఖిలపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు.
దీంతో బంద్ లో భాగంగా హిందూపురంలో బస్సులు కూడా దాదాపు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ కు సంఘీభావంగా హిందూపురంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్వహిస్తున్న వారు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ ను ప్రభుత్వానికి తెలిసేలా చేశారు.
ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన యువకుడు
ఇదిలా ఉంటే ఈరోజు హిందూపురం బంద్ లో భాగంగా జరుగుతున్న ఆందోళనలో హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవీన్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న అఖిలపక్ష నేతలు వెంటనే స్పందించి అడ్డుకుని పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు. అతనిపై వెంటనే నీళ్లు పోశారు. దీంతో అంబేద్కర్ సర్కిల్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. శాంతియుతంగా ఆందోళనలు కొనసాగించాలని సూచించారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురానికి అన్యాయం జరిగిందన్న అఖిలపక్షం నాయకులు
ఈరోజు హిందూపురంలో ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురానికి అన్యాయం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద పట్టణమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. హిందూపురం పై ప్రభుత్వ ఉద్దేశం ఏంటో చెప్పాలని నిలదీస్తున్నారు.
పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ప్రకటించటంపై హిందూపురంలో నిరసన సెగ
హిందూపురం జిల్లా కేంద్రం చేస్తామని చెప్పిన వైసీపీ నేతలను సైతం హిందూపురం ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం కోసం కృషి చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లో భాగంగా అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించింట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయంపై పుట్టపర్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తే, హిందూపురం వాసులు మాత్రం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అఖిలపక్ష నాయకుల బైక్ ర్యాలీ.. ఆందోళనలు
లోక్ సభ నియోజక వర్గమైన హిందూపురాన్ని కాదని, పుట్టపర్తి జిల్లా కేంద్రం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో శుక్రవారం అఖిలపక్ష నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో హిందూపురానికి అన్యాయం జరిగిందని హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు.
Recommended Video
కొనసాగుతున్న హిందూపురం బంద్ .. జిల్లా కేంద్రం చెయ్యాలన్న బాలకృష్ణ
అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయని, హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం కోసం ప్రస్తుతం బంద్ కొనసాగుతున్న సందర్భం చోటుచేసుకోగా, ముందు ముందు మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆందోళన కలిగిస్తుంది.