Tirupati Nagarjunasagar by-poll results: తిరుపతి పోస్టల్ బ్యాలెట్స్ లో వైసీపీ ఆధిక్యం!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక ఫలితాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ కు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది.
కరోనా నిబంధనలతో కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా, కరోనా నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో ఈ రెండు చోట్ల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు . తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్ లు, శ్రీకాళహస్తిలో 17 , సత్యవేడు 14 , సర్వేపల్లి 22, గూడూరు 23 ,వెంకటగిరి 23 ,సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది.
పోస్టల బ్యాలెట్ లో వైసీపీ ఆధిక్యం
కౌంటింగ్ లో పాల్గొనే వారంతా 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ను సమర్పించి మరీ కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో వైసిపి ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా తిరుపతి లోక్ సభ స్థానం వైఎస్సార్సీపీ ఖాతాలో చేరినట్టు ఆరా సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా ప్రారంభ ఫలితాలే వైసీపీకి అనుకూలంగా రావటం కనిపిస్తుంది.
25 రౌండ్లలో నాగార్జున సాగర్ ఓట్ల లెక్కింపు, సర్వత్రా ఉత్కంఠ
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు కౌంటింగ్ కొనసాగనుంది. కరోనా జాగ్రత్తలతో సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రస్తుత కరోనా విజృంభణ నేపథ్యంలో కోవిడ్ నియమాలను పాటిస్తూ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అందుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఈసీ చేసింది .ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ నుండి నోముల భగత్, కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జానారెడ్డి , బిజెపి నుండి రవి కుమార్ పోటీ చేశారు.ఈరోజు కౌంటింగ్ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అన్న విషయం తేలనుంది.