కంట తడి పెట్టిస్తున్న ఉల్లి: కిలో రూ.20కే అమ్మాలని చంద్రబాబు
హైదరాబాద్: ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. సోమవారంనాడు ఆయన రైతు బజార్ల అధికారులతో సమావేశమయ్యారు. ఎల్లుండి నుంచి కిలోకు 20 రూపాయల చొప్పున ఉల్లిగడ్డలను అమ్మాలని ఆయన సూచించారు. రైతు బజార్లలో 20 రూపాయలకు కిలో ఉల్లిపాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కాగా, గత కొద్ది రోజులుగా ఉల్లిపాయల ధరలు ప్రజల జేబులకు తూట్లు పొడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. మహరాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు పెరిగాయి.

రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు. రైతు బజార్లలో కూడా కిలో ఉల్లిపాయల ధరు 34 రూపాయల దాకా ఉంది. బహిరంగ మార్కెట్లలో 40 నుంచి 45 రూపాయల వరకు పలుకుతోంది. విశాఖపట్నానికి మహారాష్ట్, గుజరాత్ల నుంచి, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నుంచి కూడా విశాఖకు ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి.
విశాఖలో ఉల్లిపాయల డిమాండ్ ప్రతి రోజూ 20 నుంచి 25 టన్నుల వరకు ఉంటుంది. అయితే, ఇప్పుడు 12 నుంచి 15 టన్నుల మాత్రమే వస్తోంది. దీంతో విపరీతమైన కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. దీంతో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ఉల్లిపాయల ధరలను కిందికి దించే చర్యలకు శ్రీకారం చుట్టారు.












Click it and Unblock the Notifications