టికెట్ల జారీలో TTD భారీ మార్పులు: నో ఆఫ్లైన్..!!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇంకొక్కరోజేన మిగిలివుంది. రేపటితో ద్వార దర్శనాలు ముగియనున్నాయి. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. 82,650 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,331 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.08 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
కాగా- భక్తుల సౌకర్యం, పరిపాలనా అవసరాల దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో భారీ మార్పులు చేసింది టీటీడీ. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనుంది. తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్లోకి మార్చనున్నారు.

ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల అవుతాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం నలుగురు) మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి.
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ విధానంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తద్వారా ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్ లో నిరీక్షించే సమస్య తొలగిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలవుతుంది. అలాగే రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల అయ్యాయి. మూడు నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ తెలిపింది.
తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజూ భక్తులకు ఆఫ్ లైన్ లో 200 టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఇందులో ఎటువంటి మార్పులు లేవు. ఈ విధానం యథావిధిగా కొనసాగనుంది. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేర్పులు చేశామని, దీన్ని గమనించి భక్తులు తమ దర్శన ప్రణాళికలను రూపొందిచుకోవాలని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications