టీచర్ల పోరుపై సజ్జల షాకింగ్ కామెంట్స్-జీర్ణించుకోలేని విపక్షాలు, ఉపాధ్యాయులది యూటర్న్
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం సద్దుమణిగాక టీచర్లు రోడ్లపైకి రావడాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధ్యాయుల పోరు, దానికి విపక్షాల మద్దతుపై ఇవాళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులతో చర్చల సమయంలో టీచర్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.
ఉద్యోగుల సమస్య సమసిపోవడాన్ని టీడీపీ, కమ్యూనిస్టులు, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె విరమించాక మళ్ళీ నీచరాజకీయమా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యను పచ్చ, ఎర్ర అద్దాలు పెట్టుకుని చూడొద్దని ఆయన సూచించారు. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో అన్నీ అంగీకరించి.. ఇప్పుడు కొన్ని సంఘాలు నిరసనలు చేస్తామంటే అర్థముందా అని సజ్జల ప్రశ్నించారు. ఫైనల్ నిర్ణయం జరిగిన తర్వాత ఉద్యోగులు ఎవరైనా ఇంకా వస్తే బాగుండేది అనుకోవడంలో తప్పులేదు. పోనీ మేము బ్రహ్మాండంగా చేశామని అంటే, అది అన్యాయం అని మీరు అనవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఎలాంటి డాంబికాలు పోకుండా ఉన్న పరిస్థితిని వివరించి, ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంకా చేసి ఉండాల్సింది అని అన్నారని సజ్జల గుర్తుచేశారు.

కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో ఇస్తున్న హెచ్ఆర్ఏ 4-6-8శాతాలేనని సజ్జల గుర్తుచేశారు. మరి ఉద్యోగుల ప్రయోజనాలు మీకు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. ఉన్నంతలో బెటర్ గా చేశామని,. చేయాల్సినంత చేయలేకపోయాం అని సీఎంగారే చెప్పారని సజ్జల తెలిపారు. ఈ ప్రభుత్వంలో అమ్ముడుపోయేది ఎవరు..? కొనగలిగేదెవరు...? ఉద్యోగులను బెదిరించిందెవరు.. బెదిరేదెవరు... అంటూ సజ్జల సూటి ప్రశ్నలు వేశారు. కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలనే అంగన్ వాడీల నుంచి ఆశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, హోం గార్డులకు జగన్ జీతాలు పెంచారని సజ్జల గుర్తుచేశారు.
మరోవైపు ఏపీపై కేసినో సంస్కృతిని రుద్దాలని టీడీపీ తహతహలాడుతోందని సజ్జల మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం తప్పా, దుబారానా..? ధైర్యముంటే చెప్పండని ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు ఓ విద్యార్థి బలి అయితే పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని సజ్జల నిలదీశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి మంత్రుల కమిటీ కొనసాగుతుందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications