బ్యానర్లతో అసెంబ్లీకి చంద్రబాబు, లోకేష్-అమరావతి నుంచి పాదయాత్రగా
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు, ఇవాళ ఉదయం తెలుగుదేశం అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఉదయం అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్సీ, నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తో కలసి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు
వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ టీడీపీ అధినేత మండిపడ్డారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చెత్తపై పన్ను వంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలన్నారు. సామాన్యులు ఈ పాలనలో చితికి పోతున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలు కూడా ఏపీలో ఎక్కవే అని చంద్రబాబు తెలిపారు.
తాజాగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీని గెలిపించుకోలేకపోయిన చంద్రబాబును అదే అంశంతో టార్గెట్ చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. అందుకే అసెంబ్లీ సమావేశాల గడువును కూడా ఒక్క రోజు నుంచి ఆరు రోజులకు పెంచింది.

ఒక్కరోజు అసెంబ్లీ నిర్వహణతో అధికార వైసీపీ పారిపోతోందన్న విమర్శ నుంచి తప్పించుకోవడంతో పాటు విపక్షాల సూచనను గౌరవించామని చెప్పుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన ప్రజా సమస్యల ప్రస్తావనతో అధికార పార్టీని ఇరుకునపెట్టేందుకు టీడీపీ అజెండా సిద్ధం చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications