స్టీల్ ప్లాంట్ కోసం అఖిల పక్షం కడప బంద్:ఎలా జరుగుతుందంటే?
కడప:కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల సాచివేత ధోరణికి నిరసనగా శుక్రవారం వైసీపీ, సీపీఎం, జనసేన, ఇతర ప్రజాసంఘాలు జిల్లా బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే.
బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు సెగ తగిలేలా చేస్తామని అఖిలపక్షం నాయకులు పునరుద్ఘాటించారు. బీజేపీ విభజన హామీలను విస్మరించినా గత నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలకు ఉపక్రమించడం రాజకీయ స్టంట్ అని తేల్చేశారు. ఈ విషయాన్నే ప్రజల దృష్టికి తీసుకెళ్లి టిడిపి,బిజెపి మోసాన్ని అర్థమయ్యేలా చేస్తామంటున్నారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైసీపీ, సీపీఎం, జనసేన, ఇతర ప్రజాసంఘాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కడప ఆర్టీసీ బస్టాండ్లలో వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోల్లో ముందస్తుగానే బస్సులను నిలిపివేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటింపచేశారు. కడప తో పాటు జిల్లా వ్యాప్తంగా మైదుకూరు,పులివెందుల, బద్వేలు, రాయచోటి, జమ్మల మడుగు, రాజంపేట తదిదర నియోజకవర్గాల్లో బంద్ కొనసాగుతోంది.
Recommended Video
ఈ బంద్ లో స్థానిక కడప నేతలతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేతలు రాఘవులు, రామకృష్ణ పాల్గొన్నారు. విభజన చట్టంలో హామి ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా కేంద్రం కుంటి సాకులు చెబుతోందని అఖిల పక్షం నేతలు ఈ సందర్భంగా విమర్శించారు. కడప ఉక్కుపై స్పష్టమైన హామీ వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.