కొడాలి నానీని పేకాడేస్తున్న ప్రతిపక్షాలు .. ఉన్నపళంగా సీఎం జగన్ దగ్గరకు మంత్రి కొడాలి నాని..ఏపీలో హాట్ టాపిక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పేకాట పాలిటిక్స్ కూడా దుమారంగా మారాయి. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేసి పేకాట క్లాబ్బులను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు చేయగా అవి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. ఇక తాజాగా గుడివాడ నియోజకవర్గంలో తిమ్మిరిస గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేయడం, పెద్ద ఎత్తున వాహనాలను నగదును సీజ్ చేయడంతో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చినట్లుగా అయింది.
ఆయనకు పేకాట క్లబ్బులపైనే శ్రద్ధ ... మంత్రి కొడాలి నానీపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
ప్రతిపక్షాలకు ఆయుధంగా పేకాట శిబిరాలపై దాడులు .. మంత్రి నానీ బామ్మర్ది పై ఆరోపణలు
ప్రతిపక్ష పార్టీలకు తాజాగా పేకాట శిబిరాలపై జరిగిన దాడులు ఆయుధంగా మారాయి.
మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో జరిగిన దాడుల్లో కొడాలి నాని బామ్మర్ది కొల్లి విజయ్ పట్టుబడ్డాడని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాదు ఈ పేకాట శిబిరంపై జరిగిన దాడిలో 60 మంది అరెస్ట్ చేశారని వారిలో కొల్లి విజయ్ కూడా ఉన్నారని ఆరోపిస్తోంది. గుడివాడలో మంత్రి కొడాలి నాని అండదండలతో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పట్టుబడ్డ 10 కోట్ల డబ్బు, 30 వాహనాలు, 60 మందిని కోర్టులో హాజరు పరచాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది .
మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్
సీఎం కు దమ్ము ధైర్యం ఉంటే మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది . టిడిపి ట్విట్టర్లో వైసీపీ మంత్రి కొడాలి నానీని టార్గెట్ చేసి ఆరోపణలు చేసింది. జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే కి చెందిన వారే పేకాట క్లబ్ నడుపుతున్నారని ఆరోపణలు ప్రస్తుతం వెల్లువ గా మారటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కి ఉన్నపళంగా రావాలని మంత్రి కొడాలి నాని కి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఉన్నపళంగా తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన నానీ
దీంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న నాని ఉన్నపళంగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారని , సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారని సమాచారం. మొన్న పవన్ కళ్యాణ్ పేకాట క్లబ్ లను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో జరిగిన దాడిలో పెద్ద ఎత్తున పేకాట రాయుళ్లను అరెస్ట్ చేయడంతో పాటుగా, భారీగా డబ్బు ను స్వాధీనం చేసుకోవడం, దీని వెనుక అధికార పార్టీ మంత్రి, సదరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరగడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
పేకాట వ్యవహారంపై జగన్ సీరియస్ .. కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పు జరుగుతుందా ?
ఇది కొడాలి నానీకి పెద్ద తలనొప్పి కాగా ఈ వ్యవహారంపై సీఎం జగన్ కూడా సీరియస్ గా ఉన్నారని సమాచారం . ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నాని ని హుటాహుటిన రావాలి అని పిలవడం కూడా కృష్ణాజిల్లా రాజకీయాలలో ఏదైనా మార్పు జరగబోతుందా అన్న అనుమానాలకు కారణంగా మారింది.
అసలు కొడాలి నానీ ఈ రోజు ఉదయం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని సీఎం జగన్ ను ఎందుకు కలిశారన్న దానిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక జగన్ తో ఏం మాట్లాడారు అన్న దానిపై చర్చ జరుగుతుంది .