పరిషత్ తీర్పును స్వాగతించిన విపక్షాలు-డివిజన్ బెంచ్లో అప్పీలుకు జగన్ సర్కార్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ రాజకీయపక్షాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పును విపక్షాలు స్వాగతించాయి. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో అప్పీలు చేయబోతోంది. దీంతో మరోసారి పరిషత్ పోరు బంతి హైకోర్టుకు చేరబోతోంది.
హైకోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ, సీపీఐ
ఏపీలో గత నెలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ హైకోర్టు మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు చేసింది. దీంతో ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును విపక్ష టీడీపీ,సీపీఐ స్వాగతించాయి. ఇది ప్రజాస్వామ్య విజయం అని, ప్రభుత్వం పద్దతి మార్చుకుని చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్వీట్ చేశారు. అటు సీపీఐ కూడా హైకోర్టు తీర్పును స్వాగతించింది. ఏపీ హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు, అధికార దుర్వినియోగానికి చెంపపెట్టని సీపీఐ రామకృష్ణ అన్నారు. అర్థాంతరంగా నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని సీపీఐ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసిందని, ఇప్పటికైనా
కరోనా తగ్గాక సజావుగా ఎన్నికలు నిర్వహించాలని రామకృష్ణ కోరారు.
హైకోర్టు తీర్పుపై వైసీపీ అసంతృప్తి
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదన్న కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికార వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తి చేసి ఓట్ల లెక్కింపు జరపాల్సిన సమయంలో ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు నిరాశ కలిగించిందని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. హైకోర్టు తీర్పుతో కరోనా సమయంలో మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పవని వారు చెప్తున్నారు.
డివిజన్ బెంచ్లో సర్కార్ అప్పీలు
పరిషత్ పోరు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సర్కార్ అప్పీలుకు వెళ్లబోతోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజెన్ బెంచ్లో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ పిటిషన్ దాఖలు చేయబోతోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాల వల్ల తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్దితి వస్తుందని, కరోనా సమయంలో అది సాధ్యం కాదని డివిజన్ బెంచ్కు చెప్పబోతోంది. ఎన్నికలు తిరిగి నిర్వహించడం ద్వారా విలువైన ప్రజాధనంతో పాటు సమయం కూడా వృథా అవుతాయని ప్రభుత్వం వాదించబోతోంది. దీంతో పరిషత్ పోరు వ్యవహారం డివిజన్ బెంచ్లో ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.