కేశవ రెడ్డికి ఏపీ ఝలక్: రూ.105 కోట్ల ఆస్తుల జఫ్తుకు ఆదేశాలు
హైదరాబాద్: కేశవ రెడ్డి విద్యాసంస్థలకు చెందిన రూ.105 కోట్ల ఆస్తులను జఫ్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 1999 డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వీటిని జఫ్తు చేయనున్నారు.
కేశవ రెడ్డి విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నాయి. గత ఏడాది కేశవ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేశవ రెడ్డి పైన కేసు నమోదయిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని అతను ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తన విద్యా సంస్థల అభివృద్ధి కోసం కేశవ రెడ్డి ఇతరుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. ఇతను తన పేరిట పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అదే సమయంలో కేశవ రెడ్డి వసూలు చేసిన మొత్తాన్ని తీసుకున్న వారికి ఇవ్వడంలో విఫలమయ్యాడని ఆదేశాల్లో ప్రస్తావించారు.
కేశవ రెడ్డి దాదాపు రూ.750 కోట్లను వసూలు చేశారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయని, ఈ కేసు తదుపరి దర్యాఫ్తును సీఐడీకి అప్పగించామని అందులో పేర్కొన్నారు. కాగా, సాయంత్రం తెలంగాణలో 24 కోట్లకు పైగా, ఏపీలో రూ.80 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేశారని తెలుస్తోంది.