పయ్యావుల మరో బాంబు- 25వేల కోట్ల ఒప్పందం-షాకింగ్ షరతులు-మద్యనిషేధం లేనట్లే
ఏపీ ఆర్ధిక వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఇవాళ మరో బాంబు పేల్చారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి సంస్ధ (ఏపీఎస్టీసీ) కోసం రూ.25 వేల కోట్ల రుణం సేకరించేందుకు బ్యాంకులతో జగన్ సర్కార్ చేసుకున్న ఓ రహస్య ఒప్పందాన్ని ఆయన బయటపెట్టారు. శాసనసభకు తెలియకుండా ఈ ఒప్పందం చేసుకోవడంతో పాటు అందులో విధించిన దారుణ షరతుల్ని ప్రభుత్వం అంగీకరించడంపై పయ్యావుల సంచలన వివరాలు వెల్లడించారు.
ఏపీఎస్టీసీకి రూ.25 వేల కోట్ల రుణం
ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీఎస్టీసీ)కి వివిధ అభివృద్ధి పనుల కోసం బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు వైసీపీ ప్రభుత్వం ఓ భారీ ప్రయత్నం చేసింది. ఇంత పెద్ద ఎత్తున సేకరిస్తున్న నిధులు కావడంతో ఇందుకోసం బ్యాంకులు కూడా ప్రభుత్వానికి అంతే స్ధాయిలో షరతులు విధించాయి. వీటిని అంగీకరించారా లేదా అన్న అంశంపై విపక్ష టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ హోదాలో ఉన్న పయ్యావుల కేశవ్ తాజాగా ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. అయితే ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రం తాము షరతులు ఒప్పుకోలేదని ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేదన్న బుగ్గన
ఏపీఎస్డీసీకి రూ.25 వేల కోట్ల రుణం ఇప్పించే విషయంలో బ్యాంకులకు తాము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆర్ధికమంత్రి బుగ్గన వెల్లడించారు. బ్యాంకులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టే తాము ఎస్క్రో పద్దుల పుస్తకంలో దీని వివరాలు రాయలేదన్నారు. టీడీపీ కోరుతున్నట్లుగా బ్యాంకులకు గ్యారంటీ ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని కూడా బుగ్గన ప్రస్తావించారు. బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే గ్యారంటీ ఇవ్వలేదన్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
వివరాలు బయటపెట్టిన పయ్యావుల
ఏపీఎస్డీసీకి రూ.25 వేల కోట్ల రుణం ఇప్పించేం విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం చేసుకున్నా శాసనసభకు తెలియజేయాల్సి ఉంటుంది. బడ్జెట్ సమర్పణ సమయంలో ఎస్ట్రో పద్దుల పుస్తకంలో దీన్ని చూపాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం తాము ఈ రుణాల కోసం ఎలాంటి గ్యారంటీలు ఇవ్వలేదని, పద్దుల పుస్తకంలో చూపలేదని చెప్పడాన్ని తప్పుబడుతూ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఇవాళ ఎంవోయూల వివరాలు బయటపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ అగ్రిమెంట్ వివరాలను పయ్యావుల వెల్లడించారు. బ్యాంకులు, ఏపీఎస్డీసీతో కలిసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు పయ్యావుల బయటపెట్టారు. ఎస్క్రో ఒప్పందంపై అంతా సంతకాలు చేశారని ఆయన వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
బ్యాంకుల షాకింగ్ షరతులు
బ్యాంకులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను బయటపెట్టిన పయ్యావుల... బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చే సమాచారం గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం ఈ షరతుల్లో ఎందుకు కోరిందని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఇవ్వకపోగా.. ఈ ఒప్పందాల్ని రహస్యంగా ఉంచాలని ఎందుకు కోరారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. శాసనసభ నుంచా, ప్రజల నుంచా, కేంద్రం నుంచా ఎవరి నుంచి ఈ వివరాలను రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సంతకాలు పెట్టాక ఒప్పందాలు రద్దు చేసుకున్నామని చెప్పొచ్చుగా అని ఆర్ధిక మంత్రి బుగ్గనకు సూచించారు.
Recommended Video
మద్య నిషేధం లేనట్లేగా ?
బ్యాంకులు ఇచ్చే రుణాలు రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఏపీఎస్డీసీకి ఇచ్చేలా సర్కార్ ఈ ఒప్పందాలు చేసుకుందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఆరోపించారు. భవిష్యత్ ఆదాయంపై ఇప్పుడే అప్పులు తెస్తున్నారని, దీనికి కేంద్రం అనుమతి ఉందా అని ప్రశ్నించారు. గవర్నర్ తరఫున అధికారులు సంతకాలు చేస్తారని, అలా గవర్నర్ కు రాజ్యాంగంలోని సార్వభౌమాధికారం ద్వారా లభించే రక్షణను కూడా వదులుకుంటామని ప్రభుత్వం షరతుల్లో అంగీకరించిందని మరో సంచలనం విషయం పయ్యావుల బయటపెట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 20 ఏళ్లలో 10 మద్యం డిపోల ద్వారా వచ్చే ఆదాయం మీకిస్తామని బ్యాంకులకు హామీ ఇచ్చిందని పయ్యావుల పేర్కొన్నారు. వచ్చే 20 ఏళ్ల పాటు మద్యం ద్వారా వచ్చే ఆదాయం బ్యాంకులకు ఇస్తామన్నారంటే 20 ఏళ్లు మద్యనిషేధం లేనట్లేగా అని పయ్యావుల ప్రశ్నించారు.