ఎస్ఈసీపై చంద్రబాబు విమర్శలు: విఫలమంటూ ఆగ్రహం, టీడీపీవారిపైనే అక్రమ కేసులు
అమరావతి: తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తొలిసారి రాష్ట్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్ఈసీ విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. ఎస్ఈసీ తన అధికారాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయిందన్నారు.
టీడీపీ మద్దతుదారులపైనే కేసులెందుకు?
గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ మద్దతుదారులపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పుంగనూరు, రొంపిచచర్ల, సోమల, చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్లు పెద్ద ఎత్తున తిరస్కరించారని మండిపడ్డారు. అడ్డగోలుగా నామినేషన్లను తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు.
ఎస్ఈసీ విఫలం
అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్ఈసీని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్ఈసీనే బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ విఫలమైందనే హైకోర్టును ఆశ్రయించినట్లు చంద్రబాబు తెలిపారు. సాక్షాత్తు పంచాయతీరాజ్ శాఖ మంత్రే ఎన్నికలను అపహాస్యం చేశారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన హక్కులు, అవకావాలు ఉంటాయన్న చంద్రబాబు.. రాష్ట్రంలో దుస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రికి కూడా వివరాలు పంపుతామని చంద్రబాబు తెలిపారు.
పోలీసులు వైసీపీ తొత్తులుగా..
గుంటూరు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై పోలీసులు అక్రమ కేసు బనాయించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలను ఎదిరిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో వినుకొండ పట్టణ సీఐ మల్లయ్య వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఏకగ్రీవం చేయకపోతే అక్రమ కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగడం హేయమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. మహిళల పట్ల అసభ్య దూషణలకు దిగుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టే పోలీసులు, అధికారులను అడ్డంపెట్టుకుంటున్నారని విమర్శించారు.
జోగిపై చర్యలు తీసుకోకుంటే.. ఎస్ఈసీ నమ్మకం పోతుంది..
మరోవైపు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఎస్ఈసీపై ఆరోపణలు చేశారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో పోలీస్ అధికారులు, ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు బరితెగించి పనిచేశారని గురువారం వీరు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో వర్ల రామయ్య మాట్లాడుతూ.. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో బరితెగించి పనిచేసిన వారి వివరాలు సేకరించామని, వారిని వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడారని, ఆ వీడియోను ఎన్నికల కమిషనర్కు వినిపించామని తెలిపారు. వీడియో చూసిన తర్వాత రిపోర్టు తెప్పించుకుంటామని ఎస్ఈసీ చెప్పిందన్నారు. ఓటు వేయకపోతే కాపునేస్తం తీసేసెస్తారా? పెన్షన్, అమ్మఒడి తీసేస్తారా? అంటూ జోగిపై వర్ల మండిపడ్డారు. జోగి రమేష్పై చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం పొంతుందన్నారు.