రూ.100 కోట్ల భూ వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే: యాదాద్రిలో సీమ నేత పేరుతో : సీఎంఓకు ఫిర్యాదు..!
తెలంగాణలో ఏపీ అధికార పార్టీకి చెందిన రాయలసీమ ఎమ్మెల్యే పేరుతో భూ వివాదం నడుస్తోంది. దీని పైన ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేరింది. దాదాపు వంద కోట్లు విలువ చేసే ఈ భూమి వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కరంగా మారింది. అయితే, ఆ వైసీపీ ఎమ్మెల్యే సైతం ముంద నుండి దాని మీద వివాదం ఉందని..తన కంటే ముందే ఫిర్యాదు చేసిన వారు కొన్నట్లుగా నిరూపిస్తే తాను తప్పుకుంటానని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు వాస్తవాలు తేల్చే పనిలో తెలంగాణ పోలీసు..రిజిస్ట్రేషన్ శాఖలు నిమగ్నమయ్యాయి. తాము 20 ఏళ్ల కిందటే ఆ భూములు కొన్నామని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పైన ఇప్పుడు ఆసక్తి కర చర్చ సాగుతోంది.
యాదాద్రిలో సీమ ఎమ్మెల్యే పేరుతో..
తెలంగాణ లోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట శివారు ప్రాంతంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఒకే సర్వే నంబరులో ఉన్న సుమారు 40 ఎకరాల భూమి మాదంటే మాదని ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్లకు పైగా పలుకుతోంది.
ఈ లెక్కన ఇక్కడి భూముల విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో వెంచర్లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఇటీవల భూమి లోపలికి ఎవరూ వెళ్లే వీల్లేకుండా కందకాలు తవ్వారు. దీంతో స్థలాలు కొన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సీఎంఓ కు ఫిర్యాదు..
తుఫ్రాన్పేటలోని అయిదు సర్వే నంబర్లులో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్ వేశారు. సర్వే నంబరు 88, 89లలో సుమారు 40 ఎకరాల భూమిలో వెంచర్ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్రెడ్డి జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారు.
వీటిని కొన్న వారిలో హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. తాజాగా ఎమ్మెల్యే కాటసాని అక్కడ కందకాలు తవ్వటం.. బోర్డులు ఏర్పాటు చేయటంతో తాము ఇరవై ఏళ్ల క్రితమే కొన్న ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. భూమి ఉన్న స్థలానికి వచ్చి సమావేశం నిర్వహించారు.
ముందే కొని ఉంటే వారికిచ్చేస్తాం..
వివాదాస్పద స్థలంలో ఎమ్మెల్యే పేరిట పెట్టిన బోర్డుల్లోని నంబర్లకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సైతం మాట్లాడారని... ఇందులో తన భూమి కూడా ఉందంటూ మాట్లాడుకుందామని ఆయన చెబుతున్నారని బాధితులు వెల్లడిస్తున్నారు. దీని పైన ఎమ్మెల్యే సైతం స్పందించినట్లు తెలుస్తోంది. పదెకరాల భూమిని 2008లో తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు.
నెల రోజులుగా కొంత మంది తనకు ఫోన్ చేస్తున్నారని.. తమ కంటే ముందే ఈ భూమి వారికి అమ్మి ఉంటే వారికే ఇచ్చేస్తామని చెప్పిన విషయాన్ని స్పష్టం చేసారు. కానీ ఈ వెంచర్పై మొదట్నుంచీ వివాదం ఉందని... దీన్ని వెంచర్గా వేసిన కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయని చెబుతున్నారు. గతంలో సీబీసీఐడీ విచారణ సాగి శివారెడ్డిని జైలుకు పంపించారని ఎమ్మెల్యే గుర్తు చేస్తున్నారు. దీన్ని కొంత మంది కావాలనే వివాదం చేస్తున్నారంటూ..తమ దగ్గర భూమి కొనుగోలుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయని ఎమ్మెల్యే కాటసాని వాదిస్తున్నారు.