విద్యుత్ పైన పరకాల, జోలెపట్టిన టీడీపీ నేతలు
హైదరాబాద్: తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారు పరకాల ప్రభాకర్ శుక్రవారం అన్నారు. సాయంత్రం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఈరోజు మధ్యాహ్నం వరకు 65 శాతం మేర విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని, ఎల్లుండికి అన్నిచోట్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు.
తుఫాను రోజు నుండి ఇప్పటి వరకు బాధితులకు 11,59,558 ఆహార పొట్లాలు అందించామని, 21స39,960 మంచినీటి ప్యాకెట్లు అందించామని, 840 టన్నుల కూరగాయలు పంపిణీ చేశామని తెలిపారు.
తుపాను సాయాన్ని నిరాకరించిన ఎయిర్ పోర్టు
హుధుద్ తుఫాను బాధితులను ఆదుకునే దాతలు చేసిన సహాయాన్ని గన్నవరం విమానాశ్రయం అధికారులు తిరస్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతానికి చెందిన దాదాపు 25వేల పులిహోర ప్యాకెట్లు, 25వేల వాటర్ ప్యాకెట్లు, 2వేల దుప్పట్లు, టవల్స్ మొత్తం సిద్ధం చేసి, వాటిని విశాఖ తరలించేందుకు గన్నవరం విమానాశ్రయానికి తీసుకు వెళ్లారు.
అయితే, వాటిని విశాఖపట్నం పంపించేందుకు కుదరదని అధికారులు ఆ సరుకులను తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. దాంతో అధికారుల తీరును నిరసిస్తూ విమానాశ్రయం వద్ద తాడేపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
జోలె పట్టిన టీడీపీ నాయకులు
ఉత్తరాంధ్ర తుఫాన్ బాధితుల కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రజాప్రతినిధులు జోలె పట్టి విరాళాలు సేక రించారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) తదితరులు పట్టణంలో ర్యాలీగా వెళుతూ విరాళాలు సేకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇప్పటి వరకు రూ.12 లక్షలు సేకరించినట్లు ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు.