'రాజధాని నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం', 'మమ్మల్ని సరిగా పిలవలేదు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే హంగామా చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి మంగళవారం నాడు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదని చెప్పారు. రైతులు భయపడి భూములు ఇచ్చారన్నారు.
దేవుళ్లనూ వదలడం లేదు: భూమన
సీఎం చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం పేరిట ప్రచారం కోసం దేవుళ్లను సైతం వదలడం లేదన్నారు. వందల కోట్లను సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు.
ఇందుకు ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. హడావుడిగా చేపడుతున్న రాజధాని నిర్మాణాలు భవిష్యత్తులో పేకమేడల్లా కూలే ప్రమాదం ఉందని భూమన హెచ్చరించారు.

శంకుస్థాపనకు వెళ్లవద్దని ఏపీ కాంగ్రెస్ నిర్ణయం
అమరావతి శంకుస్థాపనకు ఏపీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంగళవారం నాడు శైలజానాథ్ విలేకరులతో మాట్లాడారు. రాజధాని శంకుస్థాపనకు హాజరు కాకూడదని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారని శైలజానాథ్ ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు తమను సరిగా పిలవలేదని బాబుపై ఆరోపణ చేశారు.
చంద్రబాబు సమక్షంలో సర్వమత ప్రార్థనలు
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన కలశాల వద్ద సర్వమత ప్రార్థనలు జరిగాయి. వివిధ మతాలకు చెందిన పెద్దలు మత ఆచారాల ప్రకారం పూజలు చేయించారు.
అమరావతి నిర్మాణం దిగ్విజయంగా జరగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ఆటంకాలు కలగరాదని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కోడెల శివప్రసాద రావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, నారాయణ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications