సర్కార్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక: ఇకపై ఈ రైలు నడిచేది అక్కడి వరకే
కాకినాడ పోర్ట్- పుదుచ్చేరి మధ్య రాకపోకలు సాగించే సర్కార్ ఎక్స్ప్రెస్ విషయంలో రైల్వే అధికారులు ఓ కీలక ప్రకటన జారీ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ ను గమ్యస్థానాన్ని కుదించారు. ఆ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. సవరించిన ఈ విధానం ఈ నెల 11వ తేదీ నుంచి అమలులోకి రానుంది. సర్కార్ ఎక్స్ ప్రెస్ తో పాటు ఢిల్లీ- పుదుచ్చేరి మధ్య నడిచే రైలు కూడా పాక్షిక రద్దుకు గురైంది. ఇది.. తాత్కాలికమే. ఈ రెండు ఎక్స్ప్రెస్ లను యధాతథంగా ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఏపీ నుంచి పుదుచ్చేరి వెళ్లే పర్యాటకులు, వ్యాపారస్తులు, విద్యార్థులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీలలో ప్రయాణించే వారు ఈ మార్పులు గమనించి వారి ప్రయాణ సమయాన్ని, స్టేషన్లను సరి చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరే నంబర్ 17655 సర్కార్ ఎక్స్ ప్రెస్.. చెంగల్పట్టు వరకు మాత్రమే వెళ్తుంది. అదే చివరి గమ్యస్థానం అవుతుంది. చెంగల్పట్టు తర్వాతి స్టేషన్లు మేల్ మరువత్తూర్, విల్లుపురం, పుదుచ్చేరిలకు సర్కార్ ఎక్స్ ప్రెస్ వెళ్లదు. చెంగల్పట్టు- పుదుచ్చేరి స్టేషన్ల మధ్య ఈ రైలును రద్దు చేశారు. చెంగల్పట్టు నుంచే కాకినాడ పోర్టుకు తిరుగు ప్రయాణమౌతుంది.
మిగిలిన స్టేషన్లు.. కాకినాడ టౌన్, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, అత్తిలి, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, గుమ్మడిపూండి, చెన్నై ఎగ్మూర్, మాంబళం, తాంబరంలల్లో ఎటువంటి మార్పు లేదు. చెంగల్ పట్టు వరకు యధాతథంగా రాకపోకలు సాగిస్తుంది.
ఈ నెల 12వ తేదీన రాత్రి 11:15 నిమిషాలకు ఢిల్లీ నుంచి పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లాల్సిన నంబర్ 22404 వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా పాక్షికంగా రద్దయింది. ఈ రైలు విల్లుపురం వరకే వెళ్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, ట్రాక్ భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థలను ఆధునికీకరించే పనులను చేపట్టిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications